‘గవర్నర్ను చంపడానికి ఉగ్రవాదిని పంపిస్తా..’ : తమిళనాడు సర్కారు-గవర్నర్ మధ్య ముదురుతున్న వివాదం
Chennai: డీఎంకే ప్రతినిధి శివాజీ కృష్ణమూర్తి గవర్నర్పై అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'తమిళనాడు గవర్నర్ను హత్య చేసేందుకు ఉగ్రవాదిని పంపిస్తా..' నంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా రాష్ట్ర గవర్నర్, ఎంకే స్టాలిన్ ప్రభుత్వం మధ్య విభేధాలు ఈ వ్యాఖ్యలతో మరింతగా ముదురుతున్నాయి.
DMK spokesperson Sivaji Krishnamurthy: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రభుత్వాల మధ్య కొనసాగుతున్న వివాదం మరింతగా ముదురుతోంది. ఈ విభేధాలు ఇప్పటికే తారాస్థాయికి చేరుకున్నాయి. నేపథ్యంలో డీఎంకే అధికార ప్రతినిధి శివాజీ కృష్ణమూర్తి తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తమిళనాడు గవర్నర్ను హత్య చేసేందుకు ఉగ్రవాదిని పంపిస్తా.. నంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుమారం రేపుతున్నాయి.
"గవర్నర్ ను తిట్టొద్దని సీఎం కోరుతున్నారు. ఆయన ప్రసంగాన్ని సరిగ్గా చదివి ఉంటే ఆయన కాళ్లకు పూలు పెట్టి చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపేవాడిని. అంబేడ్కర్ పేరు చెప్పడానికి నిరాకరిస్తే చెప్పులతో కొట్టే హక్కు నాకు లేదా? ఆయన పేరు చెప్పడాన్ని నిరాకరిస్తే, మీరు కాశ్మీర్ కు వెళ్లండి.. మిమ్మల్ని కాల్చి చంపేందుకు ఒక ఉగ్రవాదిని పంపిస్తాం' అని శివాజీ కృష్ణమూర్తి ఓ సమావేశంలో అన్నారు.
డీఎంకే నేత వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం.. అరెస్టు చేయాలి.. !
గవర్నర్ ఆర్ఎన్ రవిపై చేసిన వ్యాఖ్యలపై డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తిని అరెస్టు చేయాలని బీజే నేత నారాయణన్ తిరుపతి డిమాండ్ చేశారు. పలువురు ఇతర బీజేపీ నాయకులు సైతం ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకే నేతలు శివాజీ కృష్ణమూర్తి, ఆర్ఎస్ భారతిలను గూండా చట్టం (Goondas Act ) కింద అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తమిళనాడు పోలీసులకు దమ్ము ధైర్యం.. వెన్నెముక ఉంటే శివాజీ కృష్ణమూర్తి, ఆర్ఎస్ భారతిలను అరెస్టు చేయాలన్నారు. వారిని గూండా చట్టం (Goondas Act )కింద అరెస్టు చేసి ఏడాది పాటు జైల్లో పెట్టాలి అని నారాయణన్ తిరుపతి డిమాండ్ చేశారు.
వివాదం ఎలా మొదలైందంటే..?
జనవరి 9న తమిళనాడు గవర్నర్ కు రాష్ట్ర అసెంబ్లీలో తన ప్రసంగాన్ని ప్రభుత్వం సిద్ధం చేసింది. అయితే, గవర్నర్ ఆర్ ఎన్ రవి శాసనసభనుద్దేశించి చేసిన ప్రసంగంలో కొన్ని అంశాలను దాటవేసి మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇదివరకు తమిళనాడు ప్రభుత్వం- గవర్నర్ మధ్య ఉన్న విభేధాలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే గవర్నర్ తీరును నిరసిస్తూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీర్మానం ప్రవేశపెట్టగా, ఆర్ ఎన్ రవి సభ నుంచి వాకౌట్ చేశారు. తమిళనాడు అసెంబ్లీలో జరిగిన వివాదం వెంటనే తీవ్ర వివాదంగా మారింది. "#GetOutRavi" ట్విట్టర్ లో ట్రెండింగ్ ప్రారంభమైంది. చాలా మంది గవర్నర్ ఆర్ ఎన్ రవిని పదవి నుండి తొలగించాలని పిలుపునిచ్చారు. ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో కూడా "#GetOutRavi" కీ వర్డ్ ట్రెండింగ్ అయింది. ఇదిలావుండగా, గవర్నర్ కు వ్యతిరేకంగా సీఎం స్టాలిన్ చేసిన తీర్మానాన్ని అగౌరవంగా, అహంకారపూరితంగా అభివర్ణిస్తూ రాష్ట్రంలోని బీజేపీ విభాగం ఆర్ఎన్ రవికి మద్దతుగా నిలిచింది.
గవర్నర్ రవిని రీకాల్ చేయండి..
డీఎంకే, రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య పోరు ఢిల్లీకి చేరుకుంది. ఐదుగురు సభ్యులతో కూడిన డీఎంకే ప్రతినిధి బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమై తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. అసెంబ్లీలో ఆయన చేష్టలపై మెమోరాండం సమర్పించింది. గవర్నర్ను రీకాల్ చేయాలని రాష్ట్రపతిని డీఎంకే మెమోరాండంలో కోరింది.