Chennai rains: నీటమునిగిన చెన్నై ఎయిర్ పోర్ట్..
Chennai rains: చెన్నై విమానాశ్రయంలోని రన్ వే, పార్కింగ్ ప్రాంతాలు భారీగా జలమయం కావడంతో విమానాశ్రయ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు.
![Chennai rains: Chennai airport submerged in water, Suspension of airport operations RMA Chennai rains: Chennai airport submerged in water, Suspension of airport operations RMA](https://static-ai.asianetnews.com/images/01hgsw5h4nm7t64qhy7xj3qbez/chennai-airport_363x203xt.jpg)
Cyclone Michaung: మిచౌంగ్ తుఫాను కారణంగా భారీ వర్షాలు, వరదలు చెన్నైని ముంచెత్తాయి. దీంతో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలోనే చెన్నై ఎయిర్ పోర్ట్ జలమయం అయింది. దీంతో తాత్కాలికంగా చెన్నై విమానాశ్రయం తన కార్యకలాపాలను నిలిపివేసింది. ప్రస్తుతం 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తుఫాను గంటకు 10 కిలోమీటర్ల వేగంతో తూర్పు-ఉత్తరం దిశగా కదులుతోంది. ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల్లో సమాంతరంగా కదులుతున్న ఈ తుపాను డిసెంబర్ 5వ తేదీ మంగళవారం నెల్లూరు- మచిలీపట్నం మధ్య తీరం దాటనుంది.
చెన్నై విమానాశ్రయంలోని రన్ వే, పార్కింగ్ ప్రాంతాలు భారీగా జలమయం కావడంతో సోమవారం రాత్రి 11 గంటల వరకు విమానాశ్రయ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఎయిర్ ఫీల్డ్ రాకపోకలను మూసివేసినట్లు తెలిపింది.
మౌచింగ్ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఓడిశాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, నెల్లూరులో పరిస్థితులు దారుణంగా మారాయి. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించిపోయింది. మిచౌంగ్ తుఫాను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఈ తుఫాను డిసెంబర్ 5న నెల్లూరు-మచిలీపట్నం మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో తీవ్ర గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ తుఫాను ప్రభావంతో దక్షిణ ఒడిశాతో పాటు కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు.