నైజీరియా నుండి వచ్చిన చిరుతలతోనే లంపీ వైరస్ వ్యాప్తి: కాంగ్రెస్ నేత నానా పటోలే
నైజీరియా నుండి చిరుతలను తీసుకు రావడం వల్లే దేశంలో లంపీ వైరస్ వ్యాప్తి చెందిందని మహరాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే చెప్పారు.
న్యూఢిల్లీ:నైజీరియా నుండి తీసుకు వచ్చిన చిరుతల కారణంగానే దేశంలో లంపీ వైరస్ వ్యాప్తి చెందిందని మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే వ్యాఖ్యానించారు.
సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. నైజీరియాలో కొంత కాలంగా లంపీ వైరస్ వ్యాప్తి చెందుతుంతదన్నారు. అక్కడి నుండి చిరుతలను కేంద్రం ఉద్దేశ్యపూర్వకంగానే తెచ్చిందని ఆయన ఆరోపించారు.
రైతులకు నష్టం చేసేందుకు ఈ చిరుతలను నైజీరియా నుండి తెప్పించారని కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు. దేశంలో ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో లంపీ వైరస్ కేసు నమోదైంది. ఈ వైరస్ సోకిన సుమారు 50 వేల పశువులు మృత్యువాతపడ్డాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్క్ లో నైజీరియా నుండి తీసుకు వచ్చిన చిరుతలన వదిలారు.దేశంలో అంతరించి పోయిన జాతిని నైజీరియా నుండి తెప్పించారు. ముంబైకి శివారులో ఖార్ ప్రాంతంలో పశువులు కొత్త రకం వ్యాధి సోకిందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో పటోలే ఈ వ్యాఖ్యలు చేశారు. ముంబైలో 27,500 పశువులున్నాయి. వీటిలో 2,200 ఆవులకు లంపీ వైరస్ రాకుండా వ్యాక్సిన్ వేసినట్టుగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ ప్రకటించింది. వచ్చే వారంలో మిగిలిన పశువులకు వ్యాక్సిన్ అందంచనున్నట్టుగా కార్పోరేషన్ అధికారులు తెలిపారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీ నుండి ముంబైలో స్లాటర్ హౌస్ లో గేదేల వధను నిలిపివేశారు. లంపీచర్మ వ్యాధి ఈగలు, దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. గుజరాత్, హర్యానా, రాజస్థాన్, పంజాబ్ సహా ఎనిమిది రాష్ట్రాల్లో ఈ వైరస్ కారణంగా వేలాది పశువులు మరణించాయి.