ఛార్ ధామ్ యాత్ర నేటి నుంచే: ఆంధ్రప్రదేశ్ యాత్రికులపై ఆంక్షలు
ఉత్తరాఖండ్ లో ఛార్ ధామ్ యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ యాత్ర జరుగుతుంది.
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ లోని ఛార్ ధామ్ యాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు శనివారం ఛార్ ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. కోవిడ్ కారణంగా చాలా కాలంగా ఛార్ ధామ్ యాత్ర ఆగిపోియంది. ఛార్ ధామ్ యాత్రపై ఉన్న నిషేధాన్ని నైనిటాల్ హైకోర్టు ఎత్తివేసింది.
అయితే, ఛార్ ధామ్ యాత్రకు వచ్చే యాత్రికులకు కొన్ని నిబంధనలు విధించింది. రెండో డోసు వాక్సిన్ వేసుకున్నవారిని మాత్రమే యాత్రకు అనుమతిస్తారు. కోవిడ్ నెగెటివ్ నివేదికును తప్పకుండా చూపించాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చే యాత్రుకులు మరింత కఠినమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. రెండో డోసు తీసుకున్న 15 రోజుల తర్వాతనే ఆంధ్రప్రదేశ్ యాత్రికులను ఛార్ ధామ్ యాత్రకు అనుమతిస్తారు. ఈ నిబంధనే మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులకు వర్తిస్తుంది.
ప్రతి రోజు పరిమిత సంఖ్యలో మాత్రమే యాత్రికులను అనుమతిస్తారు. బద్రినాథ్ లో ప్రతి రోజు వేయి మందిని అనుమతిస్తారు. కేదార్ నాథ్ లో 800 మందిని అనుమతిస్తారు. గంగోత్రిలో 600 మందిని, యమునోత్రిలో 400 మందిని అనుమతిస్తారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులు తప్పకుండా స్మార్ట్ సిటీ పోర్టల్ (compulsorily register at the Smart City portal) లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఛార్ ధామ్ యాత్ర సందర్బంగా చమోలి, రుద్రప్రయాగ్, ఉత్తరకాశి జిల్లాల్లో పోలీసు బలగాలను మోహరిస్తారు.
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఉత్తరాఖండ్ హైకోర్టు ఛార్ ధామ్ యాత్రపై విధించిన నిషేధాన్ని గురువారంనాడు ఎత్తేసింది. దీంతో ఛార్ ధామ్ యాత్రను ప్రారంభించాల్సిన అనివార్యతలో ప్రభుత్వం పడింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ సంధు శుక్రవారంనాడు కేదార్ నాథ్ సందర్శించి, ఏర్పాట్లపై, భక్తుల రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు.