Asianet News TeluguAsianet News Telugu

సిక్కు ఖైదీల విడుద‌ల‌కు డిమాండ్: క‌త్తులు, క‌ర్ర‌ల‌తో దాడి.. 30 మంది పోలీసుల‌కు గాయాలు

Chandigarh: సిక్కు ఖైదీల విడుదల కోసం ఆందోళనకారులు నిర‌స‌న‌ల‌కు దిగారు. ఈ క్ర‌మంలోనే చోటుచేసుకున్న ఘ‌ర్ష‌ణ‌లో 30 మంది పోలీసులు గాయ‌ప‌డ్డారు. నిరసనకారులు పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ నివాసం వైపు వెళ్లకుండా చండీగఢ్-మొహాలీ సరిహద్దు వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అక్కడే ఈ ఘర్షణ జరిగింది.

Chandigarh : 30 policemen were injured in a clash with protesters demanding the release of Sikh prisoners
Author
First Published Feb 9, 2023, 12:00 PM IST

Chandigarh-Mohali border Clash: సిక్కు ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులు బుధవారం చండీగఢ్ లోని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధికారిక నివాసానికి ర్యాలీగా బ‌య‌లుదేరారు. అయితే, వారి ర్యాలీని అడ్డుకున్న త‌ర్వాత‌ ఘర్షణకు దిగడంతో సుమారు 30 మంది పోలీసులు గాయపడ్డారని, పలు వాహనాలు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. నిరసనకారులు ముఖ్య‌మంత్రి భగ‌వంత్ మాన్ నివాసం వైపు వెళ్లకుండా చండీగఢ్-మొహాలీ సరిహద్దు వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులు బారికేడ్ల గుండా వెళ్లేందుకు ప్రయత్నించగా చండీగఢ్ పోలీసులు వారిని చెదరగొట్టేందుకు జలఫిరంగుల‌ను ప్రయోగించారు.

 

'క్వామీ ఇన్సాఫ్ మోర్చా' బ్యానర్ కింద ఆందోళనకారులు పోలీసులపై దాడి చేసి వాటర్ ఫిరంగి వాహనం, వజ్ర (అల్లర్ల నియంత్రణ వాహనం), రెండు పోలీసు జీపులు, అగ్నిమాపక వాహనాల‌పై కత్తులు, కర్రలతో దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ ఘ‌ర్ష‌ణ‌లో పోలీసులు, ఆందోళ‌నకారులు కూడా గాయ‌ప‌డ్డార‌ని స‌మాచారం. ఆందోళ‌న‌కారుల దాడిలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సహా 25-30 మంది సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని చండీగఢ్ డీజీపీ ప్రవీణ్ రంజన్ తెలిపారు. శిక్షాకాలం పూర్తయినప్పటికీ దేశవ్యాప్తంగా వివిధ జైళ్లలో ఉన్న సిక్కు ఖైదీలను విడుదల చేయడం సహా తమ డిమాండ్ల కోసం ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లాలని ఆందోళనకారులు భావించారు.

చండీగఢ్-మొహాలీ సరిహద్దులోని వైపీఎస్ చౌక్ వద్ద జనవరి 7 నుంచి పంజాబ్ లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఆందోళన చేస్తున్నారు. అనంతరం కొందరు నిహాంగ్ లతో సహా కత్తులు, కర్రలతో నిరసన స్థలం వద్ద గుమిగూడిన ఆందోళనకారులు హింసాత్మకంగా మారి కొందరు పోలీసులను చితకబాదార‌ని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఆందోళనకారులు పోలీసులను వెంబడించారు, వారిలో ఒకరు బాష్పవాయువు తుపాకీని కలిగి ఉన్నారు, దీనిని ఒక పోలీసు విడిచిపెట్టినట్లు తెలుస్తోంద‌ని ఎన్డీటీవీ నివేదించింది. ఆందోళనకారులు ట్రాక్టర్ ద్వారా బారికేడ్లను తొలగించారని పోలీసులు తెలిపారు.

చండీగఢ్ లో 144 సెక్షన్ విధించినందున ఆందోళనకారులను నగరంలో ఎలాంటి నిరసనకు పోలీసులు అనుమతించలేదని డీజీపీ రంజన్ తెలిపారు. పోలీసుల నుంచి ఎలాంటి రెచ్చగొట్టే చ‌ర్య‌లు లేకుండానే  ఆందోళనకారులు హింసాత్మకంగా మారి బారికేడ్లను దూకేందుకు ప్రయత్నించారు. పోలీసుల‌పై దాడి చేశార‌ని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. గుర్రాలపై ఉన్న నిహాంగ్లతో సహా పలువురు నిరసనకారులు కత్తులు, ఇనుప రాడ్లు, కర్రలతో సహా ప్రమాదకరమైన ఆయుధాలను కలిగి ఉన్నారని అధికారి తెలిపారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై కత్తులతో దాడి చేశారని డీజీపీ తెలిపారు. ప‌లువురు పోలీసులు కిందపడి తీవ్రంగా గాయపడ్డారని, వారిని ఆస్పత్రిలో చేర్పించామని వెల్ల‌డించారు. ప్రమాదకరమైన ఆయుధాలతో దాడి చేయడంతో 25-30 మంది జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయని డీజీపీ తెలిపారు.

పోలీసులపై రాళ్లు రువ్వారని రంజన్ తెలిపారు. వారిని అదుపు చేసేందుకు కనీస బలప్రయోగం చేశామ‌నీ, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆందోళనకారులు ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడే అవకాశం ఉందని పంజాబ్ పోలీసులకు ముందుగానే సమాచారం అందిందని డీజీపీ తెలిపారు. కానీ దురదృష్టవశాత్తు మొహాలీ వైపు నిరసనకారులను ఆపినట్లు కనిపించడం లేదని ఆయన అన్నారు. "ఇది నాయకత్వం లేని గుంపు" అని ఆయన అన్నారు, ఈ సంఘటనకు క్వామీ ఇన్సాఫ్ మోర్చ్ బాధ్యత వహించాలని అన్నారు. పంజాబ్ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నామనీ, ఈ విషయంలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు డీజీపీ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కానీ ఈ రోజు జరిగిన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సరిహద్దులో వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఆయుధాలతో వారు ఇక్కడికి ఎలా చేరుకున్నారనేది ఆలోచించాల్సిన విషయమన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios