కరోనా టీకా ధ్రువీకరణ పత్రంపై మోడీ ఫోటో తొలగింపు.. ఆరోగ్య శాఖ ఆదేశాలు
కరోనా టీకా ధ్రువీకరణ పత్రంపై ప్రధాని నరేంద్రమోడీ ఫోటో ఉండటంపై ప్రతిపక్షాలు అభ్యంతరాలు లేవనెత్తిన నేపథ్యంలో ఎన్నికల కమీషన్ స్పందించింది. ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో ఇక కొవిడ్ టీకా ధ్రువీకరణ పత్రంపై ప్రధాని చిత్రం ఉండదని ఈసీ తెలిపింది.
కరోనా టీకా ధ్రువీకరణ పత్రంపై ప్రధాని నరేంద్రమోడీ ఫోటో ఉండటంపై ప్రతిపక్షాలు అభ్యంతరాలు లేవనెత్తిన నేపథ్యంలో ఎన్నికల కమీషన్ స్పందించింది. ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో ఇక కొవిడ్ టీకా ధ్రువీకరణ పత్రంపై ప్రధాని చిత్రం ఉండదని ఈసీ తెలిపింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లపై మోడీ ఫొటోను తొలగించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది.
కాగా, టీకా ధ్రువపత్రాలపై మోడీ చిత్రాన్ని ఉంచడాన్ని తప్పుపడుతూ.. తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత డెరెక్ ఓబ్రీన్ ఇటీవల ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ప్రధాని తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని లేఖలో ఆరోపించారు.
ఈ ఎన్నికల సమయంలో పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో మోడీ అనవసర ప్రచారం చేసుకోకుండా చూడాలంటూ ఓబ్రీన్ ఎన్నికల సంఘాన్ని కోరారు. దీనిపై స్పందించిన ఈసీ.. ఇటీవల కేంద్రానికి లేఖ రాసింది.
ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో కరోనా టీకా ధ్రువపత్రాలపై ప్రధాని చిత్రాలను వెంటనే తొలగించాలని పేర్కొంది. అయితే ఇతర రాష్ట్రాల్లో యథావిధిగా ప్రధాని ఫోటోను కొనసాగించుకోవచ్చని తెలిపింది. ఎన్నికల కోడ్ విధి విధానాలను, నిబంధనలను కేంద్ర ఆరోగ్యశాఖ తప్పనిసరిగా పాటించాలని సూచించింది.
ఈసీ ఆదేశాల మేరకు పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరీలో టీకా ధ్రువీకరణ పత్రంపై మోడీ చిత్రాన్ని తొలగించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ఇతర రాష్ట్రాల్లో మాత్రం ప్రధాని ఫొటో ఉంటుందని స్పష్టం చేసింది.