రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం సరికొత్త పథకం
ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కోసం నోడల్ ఏజెన్సీగా అమలు చేయడానికి దేశవ్యాప్తంగా 21,000 కంటే ఎక్కువ ఆస్పత్రులకు బాధ్యతలు అప్పగించారు అని రవాణా మంత్రిత్వ శాఖ పేర్కొంది.
రోడ్డు ప్రమాద బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ పథకాన్ని తీసుకువస్తోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులకు తక్షణ సహాయార్థం రూ.2.5 లక్షల వరకు నగదు రహిత చికిత్సా పథకాన్ని ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది. కేంద్ర రోడ్లు, రహదారుల మంత్రిత్వశాఖ తన సొంత నిధులతో అదేవిధంగా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ(జీఐసీ) సహకారంతో మోటారు వాహన ప్రమాద నిధిని ఏర్పాటు చేయనుంది.
మోటారు వాహన ప్రమాద బాధితుల నగదు రహిత చికిత్స పథకాన్ని అమలు చేయడానికి , ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కోసం నోడల్ ఏజెన్సీగా అమలు చేయడానికి దేశవ్యాప్తంగా 21,000 కంటే ఎక్కువ ఆస్పత్రులకు బాధ్యతలు అప్పగించారు అని రవాణా మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇన్సూరెన్స్ ఉన్న సంఘటనల్లో బాధితుల కోసం అయ్యే ఖర్చులను జీఐసీ భరిస్తుందన్నారు. కాగా బీమా చేయని వాహనాలకు సంబంధించి ఖర్చును కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ భరిస్తుంది.
రోడ్డు ప్రమాద నిధిని ఏర్పాటు చేయడం గత ఏడాది సెప్టెంబర్లో పార్లమెంటు ఆమోదించిన ఎంవి సవరణ చట్టంలోని ముఖ్య నిబంధనలలో ఒకటి. ఈ నగదు రహిత పథకంతో దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.