భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ అనిల్ చౌహాన్​కు కేంద్రం జడ్ ప్లస్ సెక్యూరిటీ  కల్పించింది. ఆయనకు  ఢిల్లీ పోలీసులు భద్రత కల్పిస్తారని కేంద్ర హోంశాఖ ప్ర‌క‌టించింది.

భారత నూతన త్రిదళాధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్)గా బాధ్య‌తలు స్వీక‌రించిన అనిల్ చౌహాన్‌కు 'Z+' కేటగిరీ (Z+) సాయుధ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఢిల్లీ పోలీసులు ఆయనకు భద్రత కల్పిస్తారని, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సూచనల మేరకు హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

అంతకుముందు రోజు.. నూత‌న‌ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ మొదటిసారిగా త్రివిధ దళాలతో సంభాషించారు. ఈ సందర్భంగా త్రివిధ దళాల పోరాట సామర్థ్యానికి మరింతగా పదును పెట్టడంతో పాటు వనరుల సమర్థ వినియోగించుకోవ‌డానికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏకీకృత థియేటర్ కమాండ్ ఏర్పాటు దిశగా ముందుకు సాగాలని కోరారు.

దీంతో భారత సైన్యంలోని త్రిద‌ళాల‌కు థియేటర్ కమాండ్‌లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై మరోసారి చర్చ మొదలైంది. గత డిసెంబరులో హెలికాప్టర్ ప్రమాదంలో సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణించిన తరువాత ఈ నమూనా ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది.

సెప్టెంబర్ 28న కేంద్ర ప్రభుత్వం కొత్త సీడీఎస్‌ను నియమించింది. ప్రభుత్వం తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS)గా లెఫ్టినెంట్ జనరల్ (R) అనిల్ చౌహాన్‌ను నియమించింది. ఆయ‌న‌ భారత అత్యున్నత సైనిక కమాండర్‌గానూ, భారత ప్రభుత్వ సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగానూ విధులు నిర్వర్తిస్తున్నారు.

లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ త‌న 40 సంవత్సరాల కెరీర్‌లో అనేక కమాండ్, స్టాఫ్, అసిస్టెంట్ నియామకాలను నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్, ఈశాన్య భారతదేశంలో తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలలో అతనికి అపారమైన అనుభవం ఉంది.