ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సిసోడియాను మరోమారు విచారించేందుకు సీబీఐ సిద్దమవుతుండగా.. స్నూపింగ్ ఆరోపణల కేసు కూడా ఆయన మెడకు చుట్టకుంది.
ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సిసోడియాను మరోమారు విచారించేందుకు సీబీఐ సిద్దమవుతుండగా.. స్నూపింగ్ ఆరోపణల కేసు కూడా ఆయన మెడకు చుట్టకుంది. అవినీతిని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన ఫీడ్బ్యాక్ యూనిట్ (ఎఫ్బీయూ) ద్వారా ‘‘రాజకీయ ఇంటెలిజెన్స్’’(ప్రత్యర్థి పార్టీలపై స్నూపింగ్) సేకరించినట్లు ఆరోపించిన కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ విచారణకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి మంజూరు చేసింది.
అవినీతి నిరోధక చట్టం, 1988లోని సెక్షన్ 17 ప్రకారం సిసోడియాను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి మంజూరు చేయబడిందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపిన కమ్యూనికేషన్లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక, అవినీతిని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎఫ్బీయూ రాజకీయ నిఘాని సేకరించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఈ నెల ప్రారంభంలో సీబీఐ పేర్కొంది. సిసోడియాపై ఎఫ్ఐఆర్ నమోదుకు సిఫార్సు చేసింది.
ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం 2015లో ఎఫ్బీయూ ఏర్పాటును ప్రతిపాదించింది. ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (GNCTD) పరిధిలోకి వచ్చే వివిధ విభాగాలు మరియు స్వయంప్రతిపత్త సంస్థలు, సంస్థల పనితీరుకు సంబంధించి సమాచార సేకరణ, తగిన చర్యలను తీసుకునేలా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఎఫ్బీయూ ఏర్పాటుకు సంకల్పించారు. రూ. 1 కోటి నిధులు కేటాయించడంతో ఈ యూనిట్ 2016లో పని చేయడం ప్రారంభించింది.
Also Read: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ సీబీఐ సమన్లు
అయితే 2015లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారని.. అయితే ఏ అజెండా నోట్ కూడా సర్క్యూలేట్ చేయలేదని సీబీఐ ఆరోపించింది. ఎఫ్బీయూలో నియామకాల కోసం లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదని పేర్కొంది. ‘‘ఫీడ్బ్యాక్ యూనిట్.. తప్పనిసరి సమాచారం సేకరించడంతో పాటు, రాజకీయ నిఘా/ఇంటెలిజెన్స్ ఇతర అంశాలను కూడా సేకరించింది’’ అని సీబీఐ తన ప్రాథమిక విచారణ నివేదికలో పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గర్నరర్కు అభ్యర్థన చేయగా.. దానిని కేంద్ర హోం శాఖకు పంపించారు. ఈ క్రమంలోనే కేంద్ర హోం శాఖ నుంచి విచారణకు అనుమతి లభించినట్టుగా ఢిల్లీ లెఫ్టినెట్ కార్యాలయం వర్గాలు వెల్లడించాయి.
ఆప్ ఆగ్రహం..
అయితే ఈ పరిణామాలపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మనీష్ సిసోడియా బుధవారం మాట్లాడుతూ.. ఆప్ ఎంతగా అభివృద్ధి చెందుతుందో.. ఆ పార్టీ నాయకులపై ఎక్కువ కేసులు నమోదు చేయబడతాయని అన్నారు. మరోవైపు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ స్పందిస్తూ.. ఈ కేసు కేసు ‘‘పూర్తిగా నకిలీ’’ అని అన్నారు. ఆప్, అరవింద్ కేజ్రీవాల్ చూసి ప్రధాని మోదీ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
