జమ్మూకశ్మీర్ లో తీవ్రవాదులు సమాచార మార్పిడి కోసం కొన్ని యాప్ లను వాడుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ యాప్ లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. 

న్యూ ఢిల్లీ : తీవ్రవాద కార్యకలాపాలపై పోలీసులఅణిచివేతలో పెద్ద బ్రేకింగ్ సాధించారు పోలీసులు. టెర్రరిస్టులు తమ మద్దతుదారులు, ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ (OGW)తో కమ్యూనికేట్ చేయడానికి.. వారినుంచి సమాచారాన్ని తీసుకోవడానికి, పాకిస్తాన్ నుండి సమాచారం అందుకోవడానికి ఎక్కువగా జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద గ్రూపులు ఓ 14 మొబైల్ మెసేజింగ్ అప్లికేషన్‌ లను ఉపయోగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న 14 మొబైల్ మెసేజింగ్ అప్లికేషన్‌లను కేంద్రం నిషేధించింది. 

నిషేధిత యాప్‌లలో క్రిప్విసెర్ (Crypviser), ఎంజిమా(Enigma), సేఫ్ స్విస్ (Safeswiss), వికర్మి (Wickrme), మీడియా ఫైర్ (Mediafire), బ్రియర్ (Briar), బిఛాట్ (BChat), నంద్ బాక్స్ (Nandbox), కొనియన్ (Conion), ఐఎమ్ఓ(IMO), ఎలిమెంట్ (Element), సెకండ్ లైన్ (Second Line), జియాంగ్ (Zangi), తీర్మ Threema ఉన్నాయి. భద్రతా, నిఘా సంస్థల సూచన మేరకు ఈ చర్య తీసుకున్నారు. 

జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించే, భారత చట్టాలను పాటించని యాప్‌ల జాబితాను సిద్ధం చేసి, వాటిని నిషేధించాలన్న అభ్యర్థనను సంబంధిత మంత్రిత్వ శాఖకు తెలియజేసింది. ఈ యాప్‌లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000లోని సెక్షన్ 69A కింద బ్లాక్ చేశామని అధికారి జోడించారు. ఈ యాప్‌లు లోయలో తీవ్రవాద ప్రచారం చేస్తున్నాయని ఉన్నతాధికారులకు అధికారిక సమాచార మార్పిడిలో నిఘా సంస్థలు తెలిపాయని ఏఎన్‌ఐ తెలిపింది.

"ఓవర్‌గ్రౌండ్ వర్కర్లు (OGWs), ఉగ్రవాదులు తమలో తాము కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే ఛానెల్‌లను ఏజెన్సీలు ట్రాక్ చేస్తాయి. కమ్యూనికేషన్‌లలో ఒకదానిని ట్రాక్ చేస్తున్నప్పుడు, మొబైల్ అప్లికేషన్‌కు భారతదేశంలో ప్రతినిధులు లేరని ఏజెన్సీలు కనుగొన్నాయి. యాప్‌లో జరుగుతున్న కార్యకలాపాలను ట్రాక్ చేయడం కష్టం " అని ఒక అధికారి తెలిపారు.