వ్యాపారికి మత్తుమందిచ్చి కోట్ల విలువైన నగదు, నగలు ఛోరీ.. పనిమనుషుల ఘాతుకం..
రాజస్థాన్ లో ఓ వ్యాపారి ఇంట్లో పనిచేస్తున్న పనిమనుషులు దారుణానికి ఒడిగట్టారు. కుటుంబసభ్యులు తినే ఆహారంలో మత్తుమందు కలిపి భారీచోరీకి పాల్పడ్డారు.
రాజస్థాన్ : రాజస్థాన్లోని జోధ్పూర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అన్నం పెట్టారన్న విశ్వాసం కూడా లేకుండా ఆ ఇంటికే కన్నం వేశారు నలుగురు వ్యక్తులు. ఇంటి యజమానితో పాటూ ఆ ఇంట్లో మరికొందరికి మత్తు మందు ఇచ్చి భారీ చోరీకి పాల్పడ్డారు. రాజస్థాన్లోని జోధ్పూర్ లో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జోధ్పూర్ కు చెందిన హస్తకళా వ్యాపారి అశోక్ చోప్రా ఇంట్లో నలుగురు వ్యక్తులు సహాయకులుగా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి ఆయన తినే ఆహారంలో మత్తు మందు కలిపి.. ఇంట్లో నుంచి కోట్ల విలువైన నగలు, నగదుతో అతను కారులోనే ఉడాయించారు.
వ్యాపారి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు. కేసు నమోదు చేసిన పోలీసులు మొత్తం నలుగురు ఈ చోరీకి పాల్పడ్డారని వీరిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే, ఆ వ్యాపారి కారును నాగౌర్ జిల్లా సమీపంలోని కుచమన్ వద్ద వదిలి వెళ్లినట్లు గుర్తించారు. ఈ నిందితులంతా నేపాల్ కు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు.. వీరిలో ఇద్దరిని లక్ష్మీ అనే పనిమనిషి నకిలీ ఐడి కార్డులతో తీసుకు వచ్చినట్లు తెలిపారు. పక్కా ప్లాన్ ప్రకారమే దోపిడీకి పాల్పడ్డారని.. దొంగతనం సమయంలో ఇంట్లో ఉన్న సిసి కెమెరాలను పగలగొట్టి రిమోట్ కంట్రోల్ తో అన్ని గేట్లకు తాళాలు వేశారు అని.. బాధితుల మొబైల్ ఫోన్లను కూడా వారి వెంటే తీసుకుని పోయారని డిసిపి అమృతా దుహాన్ అన్నారు.
పొద్దున్నే ముగ్గురు కుటుంబ సభ్యులను హతమార్చి బావిలో పడేసిన మైనర్.. అరెస్టు
శనివారం రాత్రి ఆ వ్యాపారి తల్లి, మనవడు మినహా మిగతా వారందరికీ మత్తుమందు కలిపిన ఆహారం పెట్టడంతో వ్యాపారితో పాటు అతడి ఇంట్లో ఇద్దరు డ్రైవర్లు ఇంకా ఆ ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోలేదని అన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో అశోకో చోప్రా తన ఇద్దరు డ్రైవర్లతో పాటు తన చిన్న కుమార్తె అంకిత, ఆయన తల్లి, మనవడితో ఉన్నారని పోలీసులు తెలిపారు. లక్ష్మి అనే మహిళ వ్యాపారి తల్లి సంరక్షణ చూసేందుకు నాలుగేళ్ల క్రితమే పనిలో చేరింది. మిగతా ముగ్గురు మాత్రం రెండు నెలల క్రితమే పనిలో చేరినట్లు పోలీసులు వివరించారు. ఈ కేసులో నలుగురు ప్రధాన నిందితులుగా పేర్కొన్న పోలీసులు ఇతర బయట వ్యక్తుల ప్రమేయం కూడా ఉండవచ్చుననే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నిందితుల్లో ఎవరికీ పోలీస్ వెరిఫికేషన్ జరగలేదని వీరంతా ఢిల్లీ నుంచి ఓ ఏజెన్సీ ద్వారా వచ్చారని తెలిపారు.