పీఎఫ్ఐ పై UAPA కింద కేసులు నమోదు.. ఢిల్లీలో ఆఫీసులకు సీల్ !
PFI: ఉగ్రవాద, దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ), దాని అనుబంధ సంస్థలు, వ్యక్తులపై చర్యలు తీసుకుంటూ ఐదేండ్ల పాటు నిషేధం విధించింది.
Popular Front of India: నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)పై ఢిల్లీ పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ-ఉపా)లోని సంబంధిత సెక్షన్ల కింద తాజా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అందుతున్న రిపోర్టులు ప్రకారం దేశరాధానిలోని సౌత్ ఈస్ట్ ఢిల్లీలోని షాహీన్ బాగ్ పోలీస్ స్టేషన్లో గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. తాజాగా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సూచన మేరకు షాహీన్ బాగ్లోని మూడు కార్యాలయాలను ఢిల్లీ పోలీసులు సీల్ చేశారు. షాహీన్ బాగ్లో పీఎఫ్ఐకి స్థానిక ముస్లిం సమాజంలో లోతైన మూలాలు ఉన్నందున వేగంగా విస్తరిస్తోందని ఆ వర్గాలు తెలిపాయి.
"వారు మొదటి నుండి మోసపూరితంగా ముస్లింలతో స్నేహం చేశారు. వారు ఇక్కడ సభ్యులుగా ఉన్నారు. ప్రారంభంలో పీఎఫ్ఐకి ఒక కార్యాలయం మాత్రమే ఉంది. తరువాత వారు షాహీన్ బాగ్లో మరో రెండు కార్యాలయాలను తెరిచారు. ఇది వారు దానిని తమ హోమ్ గ్రౌండ్గా మార్చుకున్నారని చూపిస్తుంది”అని రిపోర్టులు పేర్కొన్నాయి. సంబంధిత అధికారుల సమాచారం ప్రకారం, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా.. పీఎఫ్ఐకి చెందిన షాహీన్ బాగ్లోని మూడు స్థలాలను సీలు చేయాలని ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరాకు లేఖ రాశారు.
“పీఎఫ్ఐకి మూడు కార్యాలయాలు ఉన్నాయి. చిరునామాలు - F30/1B గ్రౌండ్ ఫ్లోర్ జైడ్ అపార్ట్మెంట్; N44A/1 హిలాల్ హౌస్, గ్రౌండ్ ఫ్లోర్, అబుల్ ఫజల్ ఎన్క్లేవ్, జామియా; మరియు B 27/2 తిహ్రీ మంజిల్ జామియా. ఈ మూడు చోట్ల పీఎఫ్ఐ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేస్తోందని ఆరోపించారు. ఇప్పుడు మేము వాటిని సీలు చేస్తున్నాము”అని అధికారి తెలిపారు. పీఎఫ్ఐ సభ్యుల విచారణలో.. పీఎఫ్ఐ ముఖ్యంగా పేద లేదా మధ్య తరగతికి చెందిన ముస్లిం యువకులను గుర్తిస్తుందనీ, తరువాత హిందూత్వ వ్యతిరేక భావజాలంతో నింపబడి శిక్షణనిస్తుందని తేలిందన్నారు.
కాగా, కొద్ది రోజుల క్రితం నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం, ఈ కార్యాలయాల నుండి పీఎఫ్ఐ అనుమానాస్పద కార్యకలాపాలు నిర్వహించింది. ఈ క్రమంలోనే కేంద్ర దర్యాప్తు సంస్థలు పీఎఫ్ఐ కార్యాలయాలు, సంబంధిత సంస్థలు, వ్యక్తుల ప్రాంతాలపై సోదాలు నిర్వహించింది. దేశవ్యాప్తంగా వందలాది మందిని అదుపులోకి తీసుకుంది. విచారణ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాద, దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ), దాని అనుబంధ సంస్థలు, వ్యక్తులపై చర్యలు తీసుకుంటూ ఐదేండ్ల పాటు నిషేధం విధించింది.
పీఎఫ్ఐపై ఐదు సంవత్సరాల పాటు నిషేధం
ఇస్లామిక్ సంస్థ పీఎఫ్ఐకు ఐఎస్ఐఎస్ వంటి గ్లోబల్ టెర్రర్ గ్రూపులతో 'లింకులు' ఉన్నాయనీ, దేశంలో మత విద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తూ కేంద్రం ఐదేళ్ల పాటు పీఎఫ్ఐని నిషేధించింది. పీఎఫ్ఐ కి చెందిన ఎనిమిది అసోసియేట్లు.. రిహాబ్ ఇండియా ఫౌండేషన్, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్, రిహాబ్ ఫౌండేషన్ లు సైతం నిషేధిత జాబితాలో చేర్చారు. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద చట్టవిరుద్ధమైన సంస్థలుగా గుర్తించి కేసు నమోదుచేశారు.