గంగానదిలో బోట్ పార్టీ.. నాన్-వెజ్, హుక్కాతో జల్సా.. 8 మందిపై కేసు
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ నగరంలోని గంగా నదిలో పడవపై కూర్చొని కొందరు వ్యక్తులు హుక్కా తాగుతూ మాంసం తింటున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఎనిమిది మంది నిందితులపై కేసు నమోదు చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని, ప్రార్థనా స్థలాన్ని అపవిత్రం చేశారని నిందితులపై అభియోగాలు మోపారు.
గంగానదిని భారతీయ సంస్కృతిలో దేవతగా కొలుస్తారు. ఈ నదిని అత్యంత ప్రవితంగా భావిస్తూ.. పూజిస్తారు. ముఖ్యమైన పండుగ దినాల్లో.. ఇందులో స్నానం ఆచరించి.. ఆ నదీ జలాలను పవిత్ర జలంగా భావించి.. ఇంటికి తీసుకెళ్తారు. అలాంటి గంగా నది పవిత్రతను కొంతమంది నాశనం చేస్తున్నారు. తాజాగా.. కొంత మంది వ్యక్తులు గంగా నదిలో పడవపై ప్రయాణిస్తూ.. హుక్కా తాగుతూ మాంసం తింటూ జల్సా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
మూడు రోజుల క్రితం వైరల్ అయిన 30 సెకన్ల వీడియోలో.. కొంతమంది యువకులు గంగా నదిలో పడవలో ప్రయాణిస్తూ.. మద్యం తాగుతూ.. మరోవైపు .. హుక్కా పీల్చుతూ.. చికెన్ తింటూ.. జల్సాగా పార్టీ చేసుకుంటున్నారు. ఈ వీడియోను ఓ యువకుడు తన మొబైల్లో చిత్రీకరించాడు. మరి కొందరూ యువకులు మద్యం తాగుతూ..సెల్ఫీలకు ఫోజులు ఇస్తున్నట్టు ఆ వీడియో కనిపిస్తుంది. తాగిన మత్తులో ఆ వీడియో వారే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.
ఈ వీడియో నెటింట్లో వైరల్ కావడంతో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ వీడియోను కొంత మంది ప్రయాగ్రాజ్ పోలీసుల ట్విట్టర్ హ్యాండిల్లో ట్వీట్ చేశారు. ఇది మత విశ్వాసానికి అవమానకరమైన చర్య అని కామెంట్లు పోస్టు చేశారు.
ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో విచారణ ప్రారంభించారు. ఈ వీడియో ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ఎస్ఎస్పీ ప్రయాగ్రాజ్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎనిమిది మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
నిత్యం వేలాది మంది సందర్శించే పవిత్ర స్థలమైన గంగాలో హుక్కా పార్టీ చేసుకుని.. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని, ప్రార్థనా స్థలాన్ని అపవిత్రం చేశారని నిందితులపై అభియోగాలు కింద కేసు నమోదు అయినట్టు తెలుస్తుంది. నిందితుల పేర్లను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రయాగ్రాజ్ పోలీసులు తెలిపారు.