ప్రముఖ కార్టూనిస్టు అజిత్‌ నినన్‌ (68) గుండెపోటుతో శుక్రవారం మైసూరులో మృతి చెందారు.

ప్రముఖ పొలిటికల్ కార్టూనిస్ట్ అజిత్ నీనాన్ (68) గుండెపోటుతో శుక్రవారం మైసూరులో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం కార్డియాక్ అరెస్ట్ తో తుది శ్వాస విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అజిత్ నినన్ 1955 మే 15న ఆంధ్రప్రదేశ్‌లో జన్మించారు. చెన్నైలోని మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో బీఏ, ఎంఏ పూర్తి చేసి, అనంతరం కార్టూనిస్టుగా స్థిరపడ్డారు. ఇండియాటుడే, అవుట్‌లుక్‌, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ తదితర పత్రికల్లో కార్టూనిస్టుగా పనిచేశారు. ఇండియా టుడే మ్యాగజైన్ లోని 'సెంటర్‌స్టేజ్' సిరీస్, టైమ్స్ ఆఫ్ ఇండియా 'నినాన్స్ వరల్డ్'లతో ఆయనకు మంచి పేరు వచ్చింది. అలాగే.. పిల్లల మ్యాగజైన్ టార్గెట్‌లోని 'డిటెక్టివ్ మూచ్‌వాలా' అతని ప్రసిద్ధ కార్టూన్ పాత్రలలో ఒకటి.

ఆగస్టు 2022లో బెంగళూరులోని ఇండియన్ కార్టూన్ గ్యాలరీలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్ మిస్టర్ నినాన్‌ను బార్టన్ లైఫ్-టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు. పలు పత్రికల్లో సేవలందించిన ఆయన రెండేళ్ల క్రితం రిటైరయ్యారు. అజిత్ నినాన్ క్రమానుగతంగా సామాజిక సమస్యలను, రోజువారీ కార్యకలాపాలను హాస్యభరితమైన మార్గాల్లో నిశిత పరిశీలన ద్వారా ముందుకు తెచ్చారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు మనుమలు ఉన్నారు.

కార్టూనిస్ట్ అజిత్ నీనాన్ మృతి పట్ల కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ సంతాపం వ్యక్తం చేస్తూ.. భారతదేశంలోని అత్యంత ప్రతిభావంతులైన రాజకీయ కార్టూనిస్టులలో ఒకరైన అజిత్ నినాన్ ఈ రోజు మరణించారు. అతను తన ప్రత్యేక శైలిలో ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియాకు జీవం పోశాడు.