వెనక్కి చూడకుండా కార్ డోర్ ఓపెన్ చేసిన డ్రైవర్.. తప్పించబోయిన బైకర్ను ఢీకొన్న లారీ (వీడియో)
కారు డోర్లు తీసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని ఈస్ట్ బెంగళూరు డీసీపీ ఓ వీడియో ట్వీట్ చేసి సూచించారు. లేదంటే ప్రాణాంతక ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు. ఆయన పోస్టు చేసిన వీడియోలో ఓ కారు డ్రైవర్ కేర్లెస్గా డోర్ ఓపెన్ చేయగా.. ఆ డోరుకు తాకి లారీ కిందకు దూసుకుపోయిన బైకర్లు ఉన్నారు.
న్యూఢిల్లీ: ప్రమాదాలు క్షణాల్లో జరిగిపోతాయి. మనం చూస్తుండగానే దారుణాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు రెప్పపాటు కాలంలో ప్రాణాలు తీసేస్తాయి. ఒక్కోసారి కనీసం ఊహించనైనా లేము... అలాంటి రీతుల్లో ప్రమాదాలు జరుగుతాయి. ఇలాంటి ఓ వీడియోనే తూర్పు బెంగళూరు డీసీపీ ట్విట్టర్ హ్యాండిల్ పోస్టు చేసింది. అందులో చిన్నపొరపాటు కారణంగా బైక్ పై వస్తున్న ఇద్దరి ప్రాణాలు ప్రమాదంలో పడటాన్ని చూస్తూ స్తాణువైపోతున్నారు.
ఆ వీడియోలో రద్దీగా ఉన్న ఓ రోడ్డుపై బిజీ అవర్లో ఓ కారు రోడ్డుకు సమాంతరంగా ఆపారు. అంతేకాదు, ఆ కారులో నుంచి డ్రైవర్ మరింత కేర్లెస్గా డోర్ ఓపెన్ చేయడాన్ని మనం చూడవచ్చు. ఆ కారు పక్కనే ఓ బైక్ వస్తున్నది. కారు డోర్ ఓపెన్ కావడాన్ని ఊహించని ఆ బైకర్ కొంత స్లో అయ్యాడు. ఆ డోర్ను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ, కార్ డ్రైవర్ మాత్రం అదేమీ చూడలేదు. నిర్లక్ష్యంగా ఆ కారు డోర్ను మరింత బయటకు చాచాడు. దీంతో బైక్ ఆ కారు డోర్కు తగిలింది. అంతే.. అదే వేగంతో బైక్ దానికి దూరంగా జరిగింది. కానీ, దురదృష్టవశాత్తు ఎదురుగా అప్పుడే ఓ లారీ వస్తున్నది. కారు డోరుకు తగిలి దూరంగా జరిగిన ఆ బైక్పై ఉన్న ఇద్దరు యువకులు ఆ లారీ కిందకు దూసుకుపోయారు. అంతే.. లారీ ఏం మార్పు లేకుండా వెళ్లిపోయింది. కానీ, బైక్పై వెళ్లుతున్న ఇద్దరు మాత్రం రోడ్డుపై నిశ్చలంగా పడి ఉన్నారు. వెంటనే కారు డ్రైవర్ వారి వద్దకు పరుగున వచ్చాడు. మరికొందరూ అక్కడికి చేరుకున్నారు.
ఈ వీడియోలో చిన్నపాటి పొరపాటు.. ఎలా ప్రాణాల మీదకు తెస్తుందో స్పష్టంగా తెలుపుతున్నట్టుగా ఉన్నది. ఈ వీడియోను ఈస్ట్ బెంగళూరు డీసీపీ కలా క్రిష్ణస్వామి ట్విట్టర్ హ్యాండిల్ పోస్టు చేసింది. మీ వాహనం డోర్లు తీర్చేటప్పుడు దయచేసి జాగ్రత్తగా ఉండండి. ప్రాణాంతక ప్రమాదాలను నివారించండి అంటూ ఆయన సూచన చేశారు.
ప్రపంచంలో ఒక శాతం వాహనాలు మన దేశంలో ఉన్నాయని ప్రపంచ బ్యాంకు తెలుపుతున్నది. అలాగే.. రోడ్డు ప్రమాదాలు మన దేశంలోనే పది శాతం చోటుచేసుకున్నట్టు వివరిస్తున్నది. ఈ రోడ్డు ప్రమాదాలు పేద కుటుంబాల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఎందుకంటే.. ఈ ప్రమాదాల్లో 70 శాతం బాధితులు స్వల్ప ఆదాయ కుటుంబాలకు చెందినవారే కావడం గమనార్హం.