మహారాష్ట్రలో విషాదం: జనరేటర్ పొగతో ఊపిరాడక ఆరుగురు మృతి
డీజీల్ జనరేటర్ నుండి కార్బన్ మోనాక్సైడ్ వెలువడిన కారణంగా ఓకే కుటుంబంలోని ఆరుగురు మరణించారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా దుర్గాపూర్ లో ఈ ఘటన చోటు చేసుకొంది.
ముంబై:మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలోని దుర్గాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకొంది. జనరేటర్ పొగ కారణంగా ఊపిరి ఆడక ఆరుగురు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురుగా పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం నుండి ఒకరు సురక్షితంగా బయటపడ్డారు.
దుర్గాపూర్ గ్రామంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కల్గిందని అధికారులు తెలిపారు. దీంతో ఓ కుటుంబం తమ ఇంట్లో ఉన్న డీజీల్ జనరేటర్ సహాయంతో విద్యుత్ ను వాడుకొన్నారు. జనరేటర్ విడుదల చేసిన కార్బన్ మోనాక్సైడ్ కారణంగా ఒకే కుటుంబంలోని ఆరుగురు మరణించినట్టుగా నాగ్పూర్ రేంజ్ ఐజీ చిరంజీవి ప్రసాద్ తెలిపారు. మరణించిన వారిలో ముగ్గురు పెద్దవాళ్లతో పాటు ముగ్గురు చిన్నారులు కూడ ఉన్నారు.
మృతులను రమేష్ లష్కర్, కాంట్రాక్టర్ అజయ్ లష్కర్, లఖన్ లష్కర్, కృష్ణ లష్కర్, పూజ లష్కర్, మాధురి లష్కర్ లుగా గుర్తించారు. ఈ ప్రమాదం నుండి మైనర్ బాలిక బయటపడింది. ప్రాణాలతో బయటపడిన బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. మరణానికి కచ్చితమైన కారణం తెలియదన్నారు. వీరి మరణం గురించి కారణాలను తెలుసుకొనేందుకు మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపారు.