పూణెలో ఓ 7 ఏళ్ల బాలుడిని కారు ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. ఈ విషాద ఘటనలో బాలుడు మృతి చెందాడు. 

పూణె : ఫూణెలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ బాలుడిని ఢీకొట్టిన కారు 700-800 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. 7 ఏళ్ల బాలుడు, అతని తల్లి ప్రయాణిస్తున్న స్కూటర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదం పూణెలో గురువారం జరిగింది. ఈ ఘటనలో ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు, అతను, అతని తల్లి ప్రయాణిస్తున్న టూవీలర్ మీదికి వేగంగా వచ్చిన కారు దూసుకెళ్లింది.

కారు వారిని బలంగా ఢీకొట్టడంతో తల్లికి తీవ్రగాయాలు అయ్యాయని, బాలుడిని 700 నుంచి 800 మీటర్ల దూరం కారు ఈడ్చుకెళ్లిందని పోలీసులు తెలిపారు. ఇదంతా సీసీటీవీ కెమెరాలో నమోదయ్యింది. కారు ఢీకొట్టడం గమనించిన స్థానికులు బాలుడికి సహాయం చేయడం కోసం పరిగెత్తడం కూడా అందులో కనిపిస్తుంది.

భర్తనే యముడయ్యాడు.. ఆస్తి కోసం వైద్యురాలిని కడతేర్చిన వైద్యుడు..

ప్రమాదం జరిగిన సమయంలో కారు డ్రైవర్ రాహుల్ తాప్‌కీర్ మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. స్కూటర్‌పై వెళ్తున్న బాలుడు, అతని తల్లిపైకి కారు దూసుకెళ్లాడు. వారిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ బాలుడు తీవ్ర గాయాలపాలవ్వడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తల్లికి తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా రాహుల్ తప్కీర్ (40)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూణేలోని చరోలి ఫాటా వద్ద మహిళ తన కొడుకు టూ వీలర్ మీద వెడుతుండగా.. కారు వెనుక నుండి ఢీకొట్టిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఆ తాకిడికి కిందపడ్డ చిన్నారి కారు కిందకు వెళ్ళిపోయాడు. దీంతో కారు ఆ చిన్నారిని ఈడ్చుకెళ్లినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.