Capt Amarinder Singh: బీజేపీలో చేరనున్న కెప్టెన్ అమరీందర్ సింగ్..! బీజేపీలో పంజాబ్ లోక్ కాంగ్రెస్ విలీనం!!
Capt Amarinder Singh: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరి.. తన పంజాబ్ లోక్పాల్ పార్టీని కాషాయ పార్టీలో విలీనం చేయబోతున్నట్టు సమాచారం.
Capt Amarinder Singh: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ త్వరలో బీజేపీలో చేరనున్నారు. అలాగే తన పంజాబ్ లోక్పాల్ పార్టీని కాషాయ పార్టీలో విలీనం చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. విశ్వనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అమరీందర్ సింగ్ ప్రస్తుతం లండన్లో వెన్ను శస్త్రచికిత్స చేయించుకుని.. కోలుకుంటున్నారు. వచ్చే వారం చివరి నాటికి భారతదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. భారత్ కు వచ్చిన తర్వాత బీజేపీలో చేరే ప్రక్రియ ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఈ క్రమంలో తన స్వంత రాజకీయ పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ను కాషాయ పార్టీలో విలీనం చేయనున్నట్టు తెలుస్తోంది.
అమరీందర్ సింగ్ గత ఏడాది చివర్లో సిఎం పదవి నుండి వైదొలిగిన తరువాత.. కాంగ్రెస్ పార్టీ నాయకులతో అభిప్రాయ భేదాలు తల్లెత్తాయి. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగారు. అనంతరం.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ -అనే నూతన రాజకీయ పార్టీని స్థాపించారు. అయితే.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి మద్దతు నిలిచినా.. ఘోర పరాజయం పాలయ్యారు.
అలాగే.. అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్క్రమణ తర్వాత.. పార్టీకి కీలక పరిణామాలు జరిగాయి. అమరీందర్ సన్నిహితంగా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు పార్టీని వీడి బిజెపిలో చేరారు. వారిలో పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు (PPCC), రాష్ట్ర మంత్రి సునీల్ జాఖర్, కెప్టెన్ కేబినెట్లో మంత్రులుగా పనిచేసిన రాజ్ కుమార్ వెర్కా, దళిత నాయకుడు సుందర్ శామ్ అరోరా, PPCC వర్కింగ్ ప్రెసిడెంట్ బల్బీర్ సింగ్ సిద్ధూ, గురుప్రీత్, ప్రముఖ జాట్-సిక్కు నాయకులు సింగ్ కంగర్ లు కాంగ్రెస్ కు ఊహించిన షాక్ ఇచ్చి.. బీజేపీ తీర్థాన్ని స్వీకరించారు. అప్పటి నుంచి ఆయన కూడా బీజేపీలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్.
ఇదిలా ఉంటే.. కేంద్ర మాజీ మంత్రి, పాటియాలా పార్లమెంట్ సిట్టింగ్ సభ్యురాలు, అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్ కూడా బీజేపీలో చేరితే.. ఎలాంటి స్థానం కల్పించాలన్నదే బీజేపీ ముందున్న ప్రధాన సవాల్ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదే తరుణంలో ప్రణీత్ కౌర్ తన రాజకీయ వారసురాలుగా...తన కుమార్తె జై ఇందర్ కౌర్ ను రాజకీయాల్లోకి తీసుకరావాలని భావిస్తునట్టు తెలుస్తుంది. జై ఇందర్ కౌర్కు పాటియాలా లోక్సభ టిక్కెట్పై బీజేపీ హామీ ఇవ్వాలని కోరుతున్నట్టు తెలుస్తుంది. ప్రణీత్ కౌర్ తన భర్త, అతని స్నేహితులు చాలా మంది పార్టీని విడిచిపెట్టినప్పటికీ, ఆమె కాంగ్రెస్ను విడిచిపెట్టకపోవడం పట్ల బిజెపి నాయకత్వం సంతోషంగా లేదని సమాచారం.
ఇదిలా ఉంటే.. జై ఇందర్ తన తల్లిదండ్రులకు ఎన్నికలలో సహాయం చేస్తున్నారు. ఇటీవల పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజోత్ కౌర్ స్థానంలో ఆల్ ఇండియా జాట్ మహాసభ అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. ఏదిఏమైనా.. అమరేందర్ సింగ్ లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాతే.. కెప్టెన్ తన పార్టీని బీజేపీలో విలీనం చేసే విషయంపై స్పష్టత వస్తుంది. ప్రణీత్ బీజేపీలో చేరికపై బీజేపీ ఆయనతో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.