నామినేషన్ వేయడానికి దున్నపోతుపై వెళ్లిన అభ్యర్థి.. పెట్రోల్ ధర భరించలేనని వ్యాఖ్య
ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి చమురు ధరలపై వినూత్న రీతిలో నిరసన చేశారు. నామినేషన్ వేయడానికి దున్నపోతుపై వెళ్లారు. పెట్రోల్, డీజిల్ను కొనుగోలు శక్తి తనకు లేదని ఆయన వివరించారు. బిహార్లో త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నారు.
పాట్నా: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలపై నిత్యం నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఫలితంగా నిత్యావసర ధరలూ క్రమంగా పెరుగుతున్నాయి. వీటిపై వినూత్న నిరసనలు వస్తున్నాయి. బిహార్లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి ఓ అభ్యర్థి దున్నపోతును ఎంచుకున్నాడు. పెట్రోల్, డీజిల్ను కొనుగోలు చేయడం తనతో కాదని, అది తన శక్తికి మించినదని సదరు అభ్యర్థి పేర్కొన్నారు. అందుకే నామినేషన్ వేసి రావడానికి దున్నపోతును వాహనంగా ఎంచుకున్నట్టు సెలవిచ్చారు.
కాతిహార్ జిల్లాలో రామ్పూర్ అనే పంచాయతీ ఉన్నది. ఈ పంచాయతీకి చెందినవాడే ఆజాం ఆలం. ఈ పంచాయతీ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్నారు. ఇందుకోసం నిన్న నామినేషన్ కూడా వేశారు. ఈ ప్రక్రియలోనూ తన వైఖరిని స్పష్టం చేసుకున్నారు. ఇంధన ధరలపై నిరసన వ్యక్తం చేస్తూ దున్నపోతుపై వెళ్లి నామినేషన్ వేశారు. ‘నేను పశువులు పెంచుతాను. కాబట్టి, దున్నపోతుపై వచ్చాను. ప్రస్తుత ధరలు పెట్టి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయలేను’ అని తెలిపారు.
బిహార్లో ఈ నెల 24 నుంచి డిసెంబర్ 12వరకు 11 దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. వరదల బారినపడ్డ జిల్లాలు తొలి దశలో బరిలో లేవు.