ఏపీకి కేంద్రం తీపికబురు : కృష్ణపట్నం ఇండస్ట్రియల్ కారిడార్కు ఓకే
ప్రధాని అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మూడు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుతో పాటు ఆకాశ్ మిస్సైల్ సిస్టమ్ ఎగుమతికి మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది
ప్రధాని అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మూడు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుతో పాటు ఆకాశ్ మిస్సైల్ సిస్టమ్ ఎగుమతికి మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది.
ఏపీలోని కృష్ణపట్నం, కర్ణాటక రాష్ట్రం తూముకూరులో పారిశ్రామిక కారిడార్లతో పాటు గ్రేటర్ నోయిడాలోని మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ హబ్ & మల్టీ-మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్లకు కేబినెట్ అనుమతి తెలిపింది.
మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు తెలిపారు. మూడు పారిశ్రామిక కారిడార్లకు కలిపి కేంద్ర ప్రభుత్వం రూ. 7,725 కోట్లను వెచ్చించనున్నట్లు తెలిపారు. ఇండస్ట్రియల్ కారిడార్లను నిర్మించడం ద్వారా 2.8 లక్షల మందికి ఉపాధి లభించనున్నట్లు అంచనా వేసినట్లు జవదేకర్ వెల్లడించారు.
కాగా కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్కు ప్రతిపాదిత వ్యయం రూ.2,139 కోట్లుగా ఉందని తెలిపారు. దీని ఏర్పాటు వల్ల పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాల కల్పనతో పాటు, తయారీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణకు వీలు కలుగుతుందని జవదేకర్ చెప్పారు.
కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ వల్ల లాజిస్టిక్ ఖర్చు తగ్గింపుతో పాటు, నిర్వహణ సామర్థ్యం మెరుగవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వీటితో పాటు భారత్, భూటాన్ దేశాల మధ్య శాంతి భద్రతలకు సంబంధించి ఎంవోయూకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని ప్రకాశ్ జవదేకర్ చెప్పారు.