2024 చివరి నాటికి అమెరికా తరహాలో రోడ్లు, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తాం: నితిన్ గడ్కరీ
New Delhi: 2024 చివరి నాటికి అమెరికా తరహాలో రోడ్లు, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కేంద్ర బడ్జెట్ పై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆయన బడ్జెట్ పై ప్రశంసలు కురిపించారు.
Nitin Gadkari On Budget 2023: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను పార్లమెంట్ కు సమర్పించారు. అయితే, దీనిపై భిన్నాభిప్రయాలు వ్యక్తంమవుతున్నాయి. కేంద్ర బడ్జెట్ 2023పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు ప్రశంసలు కురిస్తున్నారు. అయితే, కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ బడ్జెట్లో ఈసారి భారీగా పెరుగుదల కనిపించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 36 శాతం పెరిగింది. ఇదే విషయంపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. కేంద్ర బడ్జెట్ పై ప్రశంసలు కురిపించారు. దేశంలో మెరుగైన రోడ్ల నిర్మాణంతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఓ జాతీయ న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు. దేశంలో రోడ్లను అమెరికా తరహాలో అభివృద్ది చేస్తామని కూడా ఆయన చెప్పారు.
ప్రయాణం మరింత సౌకర్యవంతంగా..
రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు ఈసారి 2.70 లక్షల కోట్ల రూపాయలు కేటాయించినట్లు నితిన్ గడ్కరీ తెలిపారు. 2024 ముగిసేలోపు, భారతదేశ రహదారి మౌలిక సదుపాయాలు అమెరికా మాదిరిగానే ఉంటాయి. "ఢిల్లీ నుండి డెహ్రాడూన్, ఛండీగఢ్, జైపూర్లకు ప్రయాణించడం చాలా సులభం-సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రజలు విమానంలో ప్రయాణించాల్సిన అవసరం లేదు. దేశంలోని మౌలిక వసతుల్లో మార్పు రావాలంటే వెనుకబడిన ప్రాంతాలపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి మా ప్రాధాన్యత.." అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. .
గ్లోబల్ సూపర్ ఎకానమీగా మారుతాం..: గడ్కరీ
పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్డెట్ పై ప్రశంసలు కురిపించిన నితిన్ గడ్కరీ.. భారత్ గ్లోబల్ సూపర్ ఎకానమీగా మారుతుందని చెప్పారు. రోడ్ల ద్వారానే అభివృద్ధి జరుగుతుందని కూడా నితిన్ గడ్కరీ అన్నారు. "రోడ్డు బాగు చేస్తే ఆ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చి ఉపాధి దొరుకుతుంది. ఉపాధి ఉంటే పేదరికం పోతుంది. స్వావలంబన భారతదేశం అనే తీర్మానానికి బడ్జెట్ ఊపందుకుంటుంది. ప్రపంచంలోనే సూపర్ ఎకానమీగా మారతాం. మేం ఎవరితోనూ పోటీ చేయడం లేదు. మేము మా పని మాత్రమే చేస్తున్నాం" అని నితిన్ గడ్కరీ అన్నారు.
విమర్శలే వారి పని.. ప్రతిపక్షలపై మండిపడ్డ గడ్కరీ
నితిన్ గడ్కరీ ప్రతిపక్షాలు కేంద్ర బడ్జెట్ పై చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. విమర్శలు చేయడమే వారు పనిగా పెట్టుకున్నారని కౌంటరిచ్చారు. కేంద్ర బడ్జెట్-2023 కేవలం ఎన్నికల బడ్జెట్ అంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను ఖండించారు. "కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతోపాటు పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు దీనిని ఎన్నికల బడ్జెట్గా అభివర్ణించారు. బడ్జెట్ బాగుందని వార్తలు వినే వుంటారు. ప్రతిపక్షాలకు విమర్శలు చేయడమే పని.. మీడియా మాత్రం ప్రతిపక్షాన్ని అనుసరిస్తోంది. విమర్శించడమే వారి పని. బడ్జెట్పై ప్రతిపక్షాలు కచ్చితంగా ప్రశ్నలు లేవనెత్తుతాయి" అని గడ్కరీ అన్నారు.
రాహుల్ గాంధీ ఛాలెంజ్ పై ఎమన్నారంటే..?
బీజేపీ నేతలెవరైనా జమ్మూకశ్మీర్లో పర్యటించాలని రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. దీనిపై నితిన్ గడ్కరీ మాట్లాడుతూ "జమ్మూ కాశ్మీర్లో లక్ష కోట్ల విలువైన పనులు చేస్తున్నాము. కాంగ్రెస్ హయాంలో ఎన్నడూ లేని విధంగా రోడ్లు, సొరంగాలు నిర్మిస్తున్నాము. 9 ఏళ్లలో ఏం చేశామో 60 ఏళ్లలో చేయలేం. ప్రజా ప్రయోజనాల కోసం నిరంతరం నిర్ణయాలు తీసుకుంటున్నామని" అని అన్నారు. మెడికల్ కాలేజీ, ఎయిమ్స్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ దిశగా పయనిస్తున్నామని కూడా పేర్కొన్నారు. 2030 నాటికి తయారీ రంగంలో భారత్ నెంబర్వన్గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.