By-polls: 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
Election Commission: అక్టోబర్ 7న మునుగోడు ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. నామినేషన్ల సమర్పణకు ఈనెల 14వరకు తుది గడవుకాగా, 15న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 17 వరకు అవకాశం కల్పించారు. ఇక, నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 6వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు.
By-polls to 7 assembly seats: దేశంలోని ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 3న 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నామని ఈసీ తెలిపింది. వీటిలో 2 సీట్లు బీహార్లో ఉండగా, మహారాష్ట్ర, హర్యానా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశాలో ఒక్కో సీట్లు ఉన్నాయి. నవంబర్ 6న ఓట్ల లెక్కింపు జరగనుంది.
వివరాల్లోకెళ్తే.. ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 3న ఉప ఎన్నికలు జరుగుతాయనీ, మూడు రోజుల తర్వాత ఓట్ల లెక్కింపు జరుగుతుందని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సోమవారం షెడ్యూల్ను ప్రకటించింది. ఉప ఎన్నికలు జరగనున్న వాటిలో రెండు బీహార్ (మొకామా, గోపాల్గంజ్), మహారాష్ట్ర (అంధేరీ ఈస్ట్), హర్యానా (ఆదంపూర్), తెలంగాణ (మునుగోడు), ఉత్తరప్రదేశ్ (గోలా గోకరానాథ్), ఒడిశా (ధామ్నగర్)లు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఒక్కో సీటు ఖాళీగా ఉండడంతో ఎన్నికల కసరత్తు చేయాల్సి వచ్చింది.
రాష్ట్రీయ జనతాదళ్ (RJD), మొకామా నుండి అప్పటి ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ ఒక కేసులో దోషిగా తేలిన తర్వాత జూలైలో అనర్హత వేటు కారణంగా ఇక్కడ ఉప ఎన్నికల జరుగుతోంది. అలాగే, గోపాల్గంజ్ సీటును కలిగి ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుడు సుభాష్ సింగ్ ఆగస్టులో మరణించారు. దీంతో అక్కడ ఎన్నిక అనివార్యం అయింది. అంధేరి తూర్పు నియోజకవర్గం మేలో దాని శాసనసభ్యుడు, శివసేనకు చెందిన రమేష్ లట్కే మరణంతో ఖాళీ అయింది. హర్యానాలో రాష్ట్ర అసెంబ్లీకి కుల్దీప్ బిష్ణోయ్ రాజీనామా చేయడంతో ఆదంపూర్ స్థానం ఖాళీ అయింది.
ఇక తెలంగాణలో మాజీ కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక జరుగుతోంది. అక్టోబర్ 7న మునుగోడు ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. నామినేషన్ల సమర్పణకు ఈనెల 14వరకు తుది గడవుకాగా, 15న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 17 వరకు అవకాశం కల్పించారు. ఇక, నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 6వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు.
ఎన్నికల సంఘం ప్రకటించిన ఉప ఎన్నికల స్థానాలను గమనిస్తే.. మునుగోడులో రాజకీయాలు కాకరేపుతున్నాయి. కాంగ్రెస్ కంచుకోట ఆయిన మునుగోడులో అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎలాగైన విజయం సాధించాలని వ్యూహాలు రచిస్తున్నాయి. కాంగ్రెస్ తన స్థానాన్ని నిలబెట్టుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి.