ఘోరం... విద్యుత్ తీగలను తాకిన బస్సు, ఆరుగురు దుర్మరణం
ప్రయాణికులతో నిండిన ఒక బస్సు విద్యుత్ తీగను తాకడంతో షాక్ కు గురయి ఆరుగురు మరణించారు.
జాలోర్: ఓ ట్రావెల్ బస్సు శనివారం అర్థరాత్రి ప్రమాదానికి గురయవడంతో ఆరుగురు మృతిచెందారు. బస్సు దారితప్పి ఓ గ్రామంలోకి ప్రవేశించి విద్యుత్ తీగలన తాకడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.
జాలోర్ జిల్లాలోని మహేష్పురా గ్రామంలోకి దారితప్పి ఓ బస్సు ప్రవేశించింది. అర్థరాత్రి కావడంతో డ్రైవర్ విద్యుత్ తీగలను చూడకుండా బస్సును ముందుకు పోనిచ్చాడు. దీంతో బస్సంతా కరెంట్ షాక్ కు గురయ్యింది. ఈ సమయంలో బస్సులో 25మంది ప్రయాణికులు వుండగా అందరూ కరెంట్ షాక్ కు గురయ్యారు. అయితే ఆరుగురు మృతిచెందగా మరో ఆరుగురి పరిస్థితి విషమంగా వుంది.
ప్రమాదంపై సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సులోని బాధితులను వెలుపలికి తీసుకువచ్చి జిల్లా ఆసుపత్రికి తరలించారు. మొత్తం 19 మంది బాధితులకు చికిత్స పొందుతున్నారు.