అధికారులున్నది మా చెప్పులు మోయడానికే.. ఉమా భారతి షాకింగ్ కామెంట్స్..!
‘బ్యూరోక్రసీ ఏమీ లేదు. బ్యూరోక్రసీ చప్పల్స్ (చెప్పులు) తీయడానికి ఉంది. అధికారులు మా చెప్పులను తీసుకుంటారు. మేము దానిని మాత్రమే అనుమతిస్తాము’ అని ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
బీజేపీ మహిళా నాయకురాలు ఉమా భారతి సంచలన కామెంట్స్ చేశారు. ప్రభుత్వాధికారులు ఉన్నది తమ చెప్పులు తీయడానికేనంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
‘బ్యూరోక్రసీ ఏమీ లేదు. బ్యూరోక్రసీ చప్పల్స్ (చెప్పులు) తీయడానికి ఉంది. అధికారులు మా చెప్పులను తీసుకుంటారు. మేము దానిని మాత్రమే అనుమతిస్తాము’ అని ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతిని కొందరు ఓబీసీ నాయకులు శనివారం భోపాల్లోని ఆమె నివాసంలో కలిశారు. కుల ఆధారిత జనాభా గణన, ప్రైవేట్ ఉద్యోగాలలో ఓబీసీ కోటా డిమాండ్ను లేవనెత్తారు. మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోకపోతే నిరసన చేస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఉమా భారతి వారితో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బ్యూరోక్రాట్లు రాజకీయ నాయకులను నియంత్రిస్తారని మీరు అనుకుంటున్నారా? లేదు. మొదట ప్రైవేట్గా చర్చలు జరుగుతాయి. ఆపై బ్యూరోక్రసీ ఒక ఫైల్ను సిద్ధం చేస్తుంది. నన్ను అడగండి, 11 సంవత్సరాలు నేను కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నాను. ముందుగా మేము చర్చించిన తర్వాతే ఫైల్ ప్రాసెస్ అవుతుంది. రాజకీయ నాయకులను బ్యూరోక్రసీ నియంత్రిస్తుందన్నది ఒట్టిమాటే. వారేం చేయలేరు. వారు దేనికి ఉన్నారు? మా చెప్పులు తీయడానికి. మేము వారికి జీతం, పోస్టింగ్లు, ప్రమోషన్లు, పదోన్నతులు ఇస్తున్నాం. ఇక వారేం చేయగలరు? నిజం ఏమిటంటే మేము వారిని రాజకీయాల కోసం ఉపయోగిస్తాం’ అని ఆమె అన్నారు.
కాగా, ప్రభుత్వ బ్యూరోక్రాట్లపై ఉమా భారతి చేసిన ఈ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్లోని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు.