లక్నోలో కూలిన భవనం.. ముగ్గురు మృతి, 14 మందిని రక్షించిన రెస్క్యూ సిబ్బంది.. కొనసాగుతున్న సహాయక చర్యలు
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ బిల్డింగ్ ఒక్క సారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. దీనిపై సమాచారం అందిన వెంటనే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలోని వజీర్ హసన్గంజ్ రోడ్లో మంగళవారం నివాస భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకు 14 మందిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇంకా ఐదుగురు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకున్నారని డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్ చౌహాన్ తెలియజేశారు. వారికి ఆక్సిజన్ అందజేస్తున్నామని పేర్కొన్నారు. వారంతా ఒకే గదిలో ఉన్నారని, ఇద్దరు వ్యక్తులతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ఈ ఘటనలో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని అన్నారు. దీనిపై విచారణ జరుగుతోందని పేర్కొన్నారు.
స్నేహితుడిని కలిసినందుకు శ్రద్దా వాకర్ ను హతమార్చిన అఫ్తాబ్ పూనావాలా : చార్జిషీట్ లో కీలక విషయాలు
మంగళవారం - బుధవారం రాత్రి సమయంలో ఉత్తరప్రదేశ్లోని లక్నోలోని వజీర్ హసంగంజ్ రోడ్డులో నివాస భవనం కూలిపోవడంతో ముగ్గురు మరణించారని ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ ప్రకటించారు. ఘటనా స్థలంలో పోలీసులు ఉన్నారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ముగ్గురు మృతదేహాలను గుర్తించి హాస్పిటల్ కు తరలించారని పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలంలో ఉన్నారని చెప్పారు.
ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలానికి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించాలని ఆదేశించారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి సరైన చికిత్స అందించాలని ఆయన జిల్లా అడ్మినిస్ట్రేషన్ కు సూచించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా మేజిస్ట్రేట్, సీనియర్ పోలీసు అధికారులతో స్వయంగా అక్కడికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. అన్ని హాస్పిటల్స్ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.