ముంబైలో కుప్పకూలిన భవనం: సురక్షితంగా బయటపడిన 14 మంది
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని కాండివాలీలో ఓ భవనం కుప్పకూలింది. ప్రమాదం నుంచి 14 మందిని సురక్షితంగా బయటకు తీశారు. ఈ ప్రమాదం ఉదయం 6 గంటల ప్రాంతంలో జరిగింది.
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ భవనం కుప్పకూలింది. ఈ సంఘటన ఆదివారం ఉదయం ముంబైలోని కాండివాలీ పశ్చిమ ప్రాంతంలో జరిగింది. ప్రమాదం నుంచి 14 మందిని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) టీమ్ రక్షించింది.
ఆ 14 మందిలో 12 మంది మొదటి అంతస్థులోనివారు కాగా, ఇద్దరు గ్రౌండ్ ఫ్లోర్ కు చెందినవారు. ప్రమాదం ఉదయం 6 గంటల ప్రాంతంలో జరిగింది. కాండివాలీ పశ్చమంలోని దల్జీ పడాలో గల సబ్రియా మజీదు వెనక గల భవనం తొలి అంతస్థు, గ్రౌండ్ ప్లోర్ కూలినట్లు ఎన్డీఆర్ఎఫ్ కు సమాచారం అందింది.
స్థానిక సంస్థలు ముగ్గురిని వెలికి తీశారు. గాయపడిన ఇద్దరిని స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నాలుగు ఫైర్ ఇంజన్లతో, ఒక అంబులెన్స్ తో అక్కడికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.