రైతులకు మీరిచ్చేది రూ.17.. బడ్జెట్ పై రాహుల్ గాంధీ
కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు
కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఐదు ఎకరాల కన్నా తక్కువ పొలం ఉన్న రైతులకు సంవత్సరానికి రూ.6వేలు ఆర్థిక సహాయం ఇస్తామని బడ్జెట్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
బీజేపీ ఐదేళ్ల పాలనలో మీ అహంకారం, అసమర్థత కారణంగా రైతుల జీవితాలు పూర్తిగా నాశనమైపోయానని మండిపడ్డారు. ఇప్పుడు వాళ్లు పడుతున్న శ్రమకి రోజుకి రూ.17 ఇవ్వాలనుకోవడం రైతులను ఘోరంగా అవమానించడమే అవుతుందని రాహుల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
కిందట చివరి బూటకపు బడ్జెట్ అంటూ ఓ హ్యాష్ట్యాగ్ కూడా రాహుల్ ఇవ్వడం విశేషం. కిసాన్ సమ్మాన్ నిధి పథకం పేరుతో రైతులకు నేరుగా ఆర్థిక సాయం చేయాలని ఈ బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఈ పథకం వర్తింపజేయాలని నిర్ణయించడంతో మొత్తం 12 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు. ఈ పథకానికి రూ.75 వేల కోట్లు ఖర్చు కానుంది