ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత చేపట్టిన నిరాహార దీక్షకు 18 విపక్ష పార్టీలు సంఘీభావం తెలిపాయి. పలు పార్టీల నేతలు ఇక్కడ పాల్గొని మాట్లాడారు. మహిళా బిల్లు అనే కామన్ డిమాండ్తో ప్రతిపక్షాలను కవిత ఏకతాటిమీదికి తెచ్చినట్టయింది. ఈ దీక్ష విపక్షాల ఐక్యత చర్చను రేకెత్తించినా.. కాంగ్రెస్ పాత్రపై అనుమానాలు తెప్పిస్తున్నది.
న్యూఢిల్లీ: ఒక వైపు లిక్కర్ పాలసీ కేసులో ఈడీ సమన్లు అందుకున్న బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరో వైపు దేశ రాజధానిలో రాజకీయ యుద్ధానికి దిగారు. కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలన్నింటిని కూడగట్టి పోరుకు సిద్ధమయ్యారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును లోక్సభలోనూ ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలను ఏకతాటి మీదికి తెస్తున్నారు. మహిళా బిల్లు అన్ని పార్టీలను ఏకతాటి మీదికి తీసుకువచ్చే అంశం.. ఈ బిల్లును అస్త్రంగా చేసుకుని ఎమ్మెల్సీ కవిత కేంద్ర ప్రభుత్వంపై బాణం ఎక్కుపెట్టారు. ఈ రోజు నిరాహార దీక్ష చేపడుతున్నారు.
ఈ దీక్షలో పాల్గొని మహిళా బిల్లు ఆమోదానికి తోడ్పడాలని ఆమె అన్ని పార్టీలకు ఆహ్వానం పంపారు. ఆమె ఆహ్వానంపై స్పందించాయి. 18 పార్టీలు ఆమె దీక్షకు సంఘీభావం ప్రకటించాయి. జంతర్ మంతర్లో తలపెట్టిన కవిత దీక్షలో బీఆర్ఎస్ నేతలు, ఆప్ నుంచి సంజయ్ సింగ్, ఛిత్రా సర్వార, శివసేన ప్రతినిధులు, అకాలి దళ్ నేత నరేశ్ గుజ్రాల్, పీడీపీ నేత అంజుమ్ జావేద్ మిర్జా, నేషనల్ కాన్ఫరెన్స్ షమీ ఫిర్దోస్, తృణమూల్ కాంగ్రెస్ నేత సుస్మితా దేవ్, జేడీయూ నేత కేసీ త్యాగి, ఎన్సీపీ సీమా మాలిక్, సీపీఐ నుంచి కే నారాయణ, సీపీఎం నుంచి సీతారాం ఏచూరి, సమాజ్వాదీ నుంచిపూజా శుక్లా, ఆర్ఎల్డీ నుంచి శ్యామ్ రజక్లు పాల్గొన్నారు. వీరితోపాటు కపిల్ సిబల్, ప్రశాంత్ భూషణ్ సహా పలువురు ప్రముఖులు ఈ దీక్షలో పాల్గొన్నారు.
Also Read: బీఆర్ఎస్ మోడల్ అంటే కుంటుంబ పాలన.. గుజరాత్ మోడల్ తో క్రోనీ క్యాపిటలిస్టులకు లబ్ది.. : కాంగ్రెస్
కవిత దీక్షతో బీజేపీపై బీఆర్ఎస్ ముఖాముఖిగా ప్రత్యక్ష యుద్ధానికి దిగినట్టయింది. కామన్ డిమాండ్ ముందుకు పెట్టి ప్రతిపక్షాలను కలుపుకోవడంలో బీఆర్ఎస్ చాలా వరకు సఫలమైంది. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ దీక్ష కీలక సమీకరణాలకు భూమికగా మారే అవకాశం ఉన్నది.
ప్రతిపక్షాల్లో పెద్దన్న పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్ మాత్రం వ్యూహాత్మకంగా దూరంగా ఉంటున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదనే ఆరోపణలతో 8 విపక్ష పార్టీలు రాసిన లేఖలోనూ కాంగ్రెస్ లేదు. ప్రముఖ విపక్ష పార్టీలకు డిస్టెన్స్ మెయింటెయిన్ చేసింది. తాజాగా, కవిత దీక్షకూ కాంగ్రెస్ దూరం పాటించడంతో 2024 విపక్షాల ఐక్యతలో కాంగ్రెస్ పాత్రపై సందిగ్దత ఏర్పడుతున్నది. మరోవైపు కాంగ్రెస్తో కలిసేదే లేదని టీఎంసీ ప్రకటించడం ఈ అనుమానాలను మరింత పెంచుతున్నది.
ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు దీక్ష సాగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి రాలేదు. కవిత దీక్షకు వచ్చే అవకాశాల్లేవని కాంగ్రెస్ నేతలు ఇది వరకే స్పష్టం చేశారు.
కానీ, పలు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ను లీడర్గా అంగీకరించడానికి ఇష్టపడటం లేదు. టీఎంసీ ఇది వరకే ఈ విషయాన్ని పలుమార్లు స్పష్టం చేసింది. తాజాగా, కవిత కూడా కాంగ్రెస్ను టీమ్ ప్లేయర్గానే ఉండాలని సూచించడం గమనార్హం.
