మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఇవాళ ఉదయం న్యూడిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగిన కల్వకుంట్ల కవిత విరమించారు. ఈ సందర్భంగా తన దీక్షకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కవిత ధన్యవాదాలు తెలిపారు.
Kavitha Deeksha : దీక్ష విరమించిన కవిత... వారికి పేరుపేరున ధన్యవాదాలు

న్యూడిల్లీ :మహిళా రిజర్వేషన్ల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దేశ రాజధాని న్యూడిల్లీలో దీక్ష చేపట్టారు. పార్లమెంట్ లో వెంటనే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని... తద్వారా మహిళా సాధికారత దిశగా చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద భారత జాగృతి ఆధ్వర్యంలో జరిగే దీక్షలో కవిత పాల్గొననున్నారు. అయితే లిక్కర్ స్కాం లో కవితకు ఈడి నోటీసులు, దీక్షకు పోలీసుల షరతుల నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.
దీక్ష విరమించిన కవిత... మద్దతిచ్చిన వారికి పేరుపేరున ధన్యవాదాలు
మోదీ సర్కార్ తల్చుకుంటే మహిళా రిజర్వేషన్లు : కవిత
మోదీ సర్కార్ తల్చుకుంటే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలవుతుందని కవిత అన్నారు. డిసెంబర్ లో పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు పోరాడుతూనే వుంటామన్నారు. మహిళా రాష్ట్రపతి కూడా రిజర్వేషన్ బిల్లు అమలయ్యేలా చూడాలని అన్నారు. ఈ పోరాటం ఇంతటితో ఆగదని... మరింత ఉదృతం చేస్తామని కవిత హెచ్చరించారు.
మహిళా సాధికారత ఇంట్లోనే మొదలవుతుంది : సీపీఐ నారాయణ
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో చేపట్టిన దీక్షకు సీపీఐ జాతీయ నేత నారాయణ మద్ధతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సాధికారత ఇంట్లోనే మొదలవుతుందన్నారు. భారతదేశంలోని మహిళలు రాజకీయాల్లో హామీనిచ్చే ప్రాతినిధ్యాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నారని నారాయణ అన్నారు.
కవితకు మద్దతుగా జంతర్ మంతర్ కు ఎంపీ సంతోష్
మహిళా రిజర్వేషన్ల కోసం దేశ రాజధాని డిల్లీలో దీక్షకు దిగిన కల్వకుంట్ల కవితకు బిఆర్ఎస్ ఎంపి జోగినిపల్లి సంతోష్ మద్దతు తెలిపారు. జంతర్ మంతర్ వద్ద చేపట్టిన దీక్షాస్థలికి ఎంపీలతో కలిసివెళ్లిన సంతోష్ కవితకు సంఘీభావం తెలిపారు.


కవిత దీక్షకు మద్ధతు పలికిన అకాలీదళ్ నేత నరేష్ గుజ్రాల్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో చేపట్టిన దీక్షకు దేశంలోని రాజకీయ పక్షాలు మద్ధతుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో పంజాబ్కు చెందిన ప్రాంతీయ పార్టీ శిరోమణి అకాలీదళ్ నేత నరేష్ గుజ్రాల్ .. జంతర్ మంతర్ వద్ద కవిత దీక్షా శిబిరానికి వచ్చి మద్ధతు పలికారు.
కవితకు ఎన్సిపి, సమాజ్ వాది పార్టీల మద్దతు...
మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం ప్రారంభించిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వివిధ పార్టీల మహిళా నాయకులు మద్దతు తెలిపారు. ఎన్సిపి నుండి సీమా మాలిక్, సమాజ్ వాది పార్టీ నుండి పూజా శుక్లా తదితురులు పాల్గొన్నారు.
దీక్షకు దిగిన కవితకు మద్దతుగా నిలిచిన నాయకులు...
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దీక్షకు దిగిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకుల నుండే కాదు దేశంలోని వివిధ రాజకీయ పార్టీల నుండి మద్దతు లభించింది. దేశ రాజధాని డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షకు కూర్చున్న కవితను కలిసి మద్దతు తెలియజేస్తున్నారు నాయకులు.
కవితకు పూర్తి మద్దతు...: సీతారాం ఏచూరీ
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేస్తున్న కవితకు పూర్తిగా మద్దతు వుంటుందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్ఫష్టం చేసారు.
ధరణిలో సగం, ఆకాశంలో సగం కాదు అవకాశాల్లోనూ సగం కావాలి : కవిత
ధరణిలో సగం ఆకాశంలో సగం అన్నట్లుగానే అవకాశాల్లోనూ సగం కావాలని కోరుతున్నాం... ఈ నినాదంతో ముందుకు వెళతామని కవిత అన్నారు.
సోనియా, సుష్మా స్వరాజ్ కు కవిత ధన్యవాదాలు
మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెడితే తామంతా మద్దతు తెలియజేస్తామని కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం గతంలో పోరాడిన సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్ తో పాటు చాలామంది మహిళలకు ధన్యవాదాలు తెలిపారు.
మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందే..: కవిత
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలంటూ నిరసన దీక్ష చేపట్టిన కవిత మాట్లాడుతున్నారు. మన దేశంలో మాతా పితా అంటాం... మహిళలకు మొదటి ప్రాధ్యాన్యత వుంది. భారత దేశంలో రాజకీయాల్లో మహిళలకు మంచి అవకాశాలు దక్కాలంటే 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి.
జంతర్ మంతర్ కు చేరుకున్న కవిత... దీక్ష ప్రారంభం
జంతర్ మంతర్ వద్ద ఏర్పాటుచేసిన దీక్షా స్థలికి కవిత చేరుకున్నారు. అక్కడ ఏర్పాటుచేసిన మహనీయుల విగ్రహాలకు పూలదండలు వేసి వేదికపైకి చేరుకున్న కవిత దీక్షకు కూర్చున్నారు.
కవిత దీక్షాస్థలి వద్ద భారీగా పోలీసుల మొహరింపు
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దీక్ష చేపడుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా భారీగా పోలీసులను మొహరించారు. కవిత దీక్షకు షరతులతో కూడిన అనుమతులిచ్చిన పోలీసులు నిబంధలను అతిక్రమించకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఇందులో భాగంగానే దీక్షాస్థలి వద్ద పోలీసులను మొహరించారు.
డిల్లీలో కవిత దీక్ష...జంతర్ మంతర్ కు చేరుకున్న తెలంగాణ మహిళా మంత్రులు
మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు దేశ రాజధానిలో దీక్ష చేపట్టనున్నారు. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన ఇద్దరు మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ఇప్పటికే జంతర్ మంతర్ వద్ద ఏర్పాటుచేసిన దీక్షా స్థలికి చేరుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, భారత జాగృతి నాయకులు కూడా జంతర్ మంతర్ కు చేరుకుటున్నారు.
కవిత దీక్షను ప్రారంభించనున్న సీతారాం ఏచూరి
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం డిల్లీలో దీక్షకు సిద్దమయ్యారు. మరికాసేపట్లో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దీక్షను ప్రారంభించనున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు దీక్షకు కూర్చోనున్నారు.