మహారాష్ట్రలో కూలిన బ్రిడ్జ్.. ఒకరు మృతి.. 20 మందికి గాయాలు
Pune: మహారాష్ట్రలో వంతెన కూలిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 20 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి ₹ 1 లక్ష, స్వల్ప గాయాలైన వారికి ₹ 50,000 ఎక్స్గ్రేషియాను రైల్వే ప్రకటించింది.
Maharashtra bridge collapse: మహారాష్ట్రలో ఒక బ్రిడ్జ్ కూలిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 20 మంది గాయపడగా, వారిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి ₹ 1 లక్ష, స్వల్ప గాయాలైన వారికి ₹ 50,000 ఎక్స్గ్రేషియాను రైల్వే ప్రకటించింది.
వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్రలోని చంద్రపూర్లోని బల్లార్షా రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలో కొంత భాగం కూలిపోవడంతో పెద్ద ప్రమాదం జరిగింది. ఆదివారం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో చాలా మంది ప్రయాణికులు వంతెనపై నుంచి దాదాపు 60 అడుగుల ఎత్తు నుంచి ట్రాక్పై పడిపోయారు. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఒకరు ఈ ప్రమాదం కారణంగా ప్రాణాలు కోల్పోయారు. బాధిత ప్రయాణికులు ప్లాట్ఫారమ్ నంబర్ 1 నుండి ప్లాట్ఫారమ్ నంబర్ 4కి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మాట్లాడుతూ.. "బల్లార్షా రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి రూ. 1 లక్ష, సాధారణ గాయాలు తగిలిన వారికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియాను రైల్వే ప్రకటించింది. గాయపడిన వ్యక్తులను త్వరగా కోలుకోవడానికి ఇతర ఆసుపత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు" అని తెలిపారు.
ఆదివారం సాయంత్రం 5:10 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నాగ్పూర్ నుండి దాదాపు 150కిలో మీటర్ల దూరంలో ఉన్న చంద్రపూర్లోని స్టేషన్లోని ఓవర్బ్రిడ్జ్ ప్లాట్ఫారమ్ 1-2ని అనుసంధానించింది. ఈ ప్రమాదానికి సంబంధించి వార్తా సంస్థ ఏఎన్ఐ షేర్ చేసిన వీడియోలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నేలపై ఖాళీ గ్యాప్ కనిపించింది. అలాగే, ప్రజలు భయంతో పరుగులు తీయడం కనిపించింది.