వర్షం ఎఫెక్ట్: ఉదృతంగా ప్రవహిస్తున్న వాగును దాటిన పెళ్లికూతురు
భారీ వర్షాలతో పెళ్లికి ముహుర్తం సమయం మించిపోయింది. అయితే ముహుర్తం సమయానికి పెళ్లి మండపానికి వెళ్లాలంటే ఉధృతంగా ప్రవహిస్తున్న ఏరును దాటాల్సి వచ్చింది
చెన్నై: భారీ వర్షాలతో పెళ్లికి ముహుర్తం సమయం మించిపోయింది. అయితే ముహుర్తం సమయానికి పెళ్లి మండపానికి వెళ్లాలంటే ఉధృతంగా ప్రవహిస్తున్న ఏరును దాటాల్సి వచ్చింది. అయితే పెళ్లి కూతురుతో పాటు అత్యంత ధై్ర్యంగా పుట్టిలో ఈ ఏరును దాటి పెళ్లి మండపానికి చేరుకొంది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది.
తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లా సత్యమంగళం సమీపంలోని భవానీ సాగర్ పరిధిలోని అటవీ ప్రాంతంలో డెంగుమరడ కొండ గ్రామం ఉంది. ఈ గ్రామానికి వెళ్లాలంటే ఏరు దాటాల్సి ఉంది.
అయితే ఈ ప్రాంతానికి ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న ఏరు(వాగు) ఉదృతంగా ప్రవహిస్తోంది. ఈ వాగును దాటకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే డెంగుమరడ గ్రామానికి చెందిన రైతు అవినాశి కూతురు రాసాత్తికి కోవై జిల్లా ఆలంబుకొంబుకు చెందిన రంజిత్కుమార్తో వివాహం నిశ్చయమైంది.
ఈ నెల 20వ తేదీన వీరి వివాహాన్ని ఆలంబుకొంబులో నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే వివాహానికి రెండు రోజుల పాటు సమయం ఉన్నందున ఏరును ఎలా దాటాలనే విషయమై తర్జన భర్జన పడ్డారు. అయితే గ్రామస్తులు, అటవీశాఖాధికారులు అవినాశి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.
పెళ్లికూతురితో పాటు మరో 15 మంది కుటుంబసభ్యులు శుక్రవారం నాడు పుట్టిలో ఎక్కి వాగును దాటారు. అయితే ఈ వాగు ఉధృతిని చూస్తే తన పెళ్లి ఆగిపోవడం ఖాయమని భావించినట్టు పెళ్లికూతుు చెప్పారు. అయితే అటవీశాఖాధికారులు ధైర్యం చెప్పి తనతో పాటు తన కుటుంబసభ్యులను సురక్షితంగా బయటకు రప్పించారని ఆమె చెప్పారు.