సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా.. న్యాయశాఖ మంత్రి వెల్లడి
బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తాకు పదోన్నతి లభించింది. ఆయనను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తున్నట్టు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేసి వెల్లడించారు.
న్యూఢిల్లీ: బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపాంకర్ దత్తాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆయన త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జస్టిస్ దీపాంకర్ దత్తా చేరికతో సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 28కి పెరిగింది. సుప్రీంకోర్టులో సీజేఐ సహా మొత్తం 34 మందికి అవకాశం ఉంటుంది.
భారత రాజ్యాంగం కల్పించిన అధికారంతో బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అపాయింట్ చేసినట్టు తెలిపారు. అతనికి అభినందనలు అంటూ కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తాను ఎంపిక చేయాలని సుప్రీంకోర్టు కొలీజియమే గతేడాది సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. రిటైర్డ్ జస్టిస్ యూయూ లలిత్ సారథ్యంలోని కొలీజియం ఈ సిఫారసు చేసింది.
1965 ఫిబ్రవరి 9వ తేదీన జస్టిస్ దీపాకంర్ దత్తా జన్మించారు. ఈ ఏడాదే ఆయన 57వ పడిలో పడ్డారు. సుప్రీంకోర్టులో రిటైర్మెంట్ ఏజ్ 65 సంవత్సరాలు. కాబట్టి, జస్టిస్ దీపాంకర్ దత్తా 2030 ఫిబ్రవరి 8వ తేదీ వరకు విధులు నిర్వహిస్తారు.