మీరు మళ్లీ శ్వేత సౌధానికి వెళ్లండి: మిషెల్లీ ఒబామాకు జావెద్ అక్తర్ చిత్రమైన అప్పీల్
బాలీవుడ్ గేయకర్త జావేద్ అక్తర్.. మిషెల్లీ ఒబామాకు అరుదైన విజ్ఞప్తి చేశారు. దయచేసి మీరు శ్వేతసౌధానికి వెళ్లండి.. నా మాటలు సీరియస్గా తీసుకోండి అంటూ ట్వీట్ చేశారు.
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ లిరిసిస్ట్ జావేద్ అక్తర్ గురువారం ట్విట్టర్లో అరుదైన రీతిలో కామెంట్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామ సతీమణి మిషెల్లీ ఒబామాకు విచిత్రమైన రీతిలో అప్పీల్ చేశారు. ‘మేడం ప్లీజ్ మీరు మళ్లీ శ్వేత సౌధానికి తిరిగి వెళ్లండి. కేవలం అమెరికానే కాదు.. మొత్తం ప్రపంచమే మిమ్మల్ని వైట్ హౌజ్లో చూడాలని కోరుకుంటున్నది’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
మిషెల్లీ ఒబామా ది లైవ్ టవీ క్యారీ అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తక ప్రమోషన్లో భాగంగా ది లైట్ వీ క్యారీ టూర్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె వాషింగ్టన్ డీసీ, ఫిలడెల్ఫియా, అట్లాంటా, షికాగో, సన్ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెల్స్ నగరాల్లో పర్యటిస్తున్నారు. అక్కడ ప్రముఖ సెలెబ్రిటీలతో ఆమె ప్రోగ్రామ్ నిర్వహించనున్నారు. ఈ వివరాలను ఆమె తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్టు చేశారు. ఈ ట్వీట్ను జావేద్ అక్తర్ రీట్వీట్ చేస్తూ ఆసక్తికర అప్పీల్ చేశారు.
‘డియర్ మిషెల్లీ ఒబామా, నేను మీకు యంగ్ క్రేజీ ఫ్యాన్ను కాదు.. కానీ, ఇండియాకు చెందిన 77 ఏళ్ల రచయిత లేదా కవిని. బహుశా ఇండియాలో నేను అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. మేడం దయచేసి నా మాటలు సీరియస్గా తీసుకోండి, కేవలం అమెరికానే కాదు మొత్తం ప్రపంచం మిమ్మల్ని శ్వేత సౌధంలో చూడాలని అనుకుంటున్నది. ఈ బాధ్యత నుంచి మీరు దూరంగా వెళ్లొద్దు’ అని జావేద్ అక్తర్ ట్వీట్ చేశారు.
మిషెల్లీ ఒబామా 2017లో వైట్ హౌజ్ నుంచి బయటకు వచ్చారు. రెండో దఫా అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా బాధ్యతలు పూర్తి చేసుకున్న తర్వాత వీరు బయటకు వచ్చారు. ఫస్ట్ లేడీగా బాధ్యతలు తీసుకున్న తొలి ఆఫ్రికన్ అమెరికన్ మహిళ ఈమెనే కావడం గమనార్హం.