బాలుడి కిడ్నాప్.. రెండేళ్ల తర్వాత పక్కింట్లో అస్థిపంజరం
కుప్పకూలిన తల్లిదండ్రులు
అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకుని కొందరు కిడ్నాప్ చేశారు. ఆ కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నప్పటికీ.. పిల్లాడి ఆచూకీ మాత్రం తెలియలేదు. రెండేళ్లుగా కుమారుడి రాకకోసం ఎదురు చూస్తున్న ఆ తల్లిదండ్రులకు చివరకు ఆ కొడుకు పక్కింట్లో అస్థిపంజరమై కనిపించాడు. దీంతో.. ఒక్కసారిగా బాలుడి తల్లిదండ్రులు కుప్పకూలారు. ఈ దారుణ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. సహిబాబాద్లోని శంషద్ గార్డెన్ ప్రాంతంలో బార్బర్ పని చేసుకునే నజర్(38) కుటుంబం నివసిస్తోంది. ఈ నెల 1వ తేదీన అతని పెద్ద కొడుకు జునైద్(9) బంతి కోసం పక్కింటి డాబాపైకి వెళ్లాడు. అక్కడ ఓ చెక్కపెట్టె కనిపించటంతో మూతను తెరిచి చూశాడు. రెండడుగుల పెద్ద బొమ్మలాంటిది ఒకటి బయటపడింది. అది భయంకరంగా ఉండటంతో పరిగెత్తి తండ్రికి విషయం తెలియజేశాడు.
అయితే వారు అతని మాటలను తేలికగా తీసుకోవటంతో సెల్ ఫోన్లో ఫోటోలు తీశాడు. రెండు రోజుల తర్వాత ఆ ఫోటోలను చూసిన కుటుంబ సభ్యులు అదొక అస్థిపంజరంగా గుర్తించి ఆ పెట్టెను తెరిచి చూశారు. అయితే అదే పెట్టెలో స్కూల్ యూనిఫామ్ బయటపడటంతో అది రెండేళ్ల క్రితం కనిపించకుండా పోయిన తమ కొడుకుదేనని నజర్ గుర్తించారు.
...2016 డిసెంబరు 1వ తేదీన మహమ్మద్ జైద్(4) అనే బాలుడు కనిపించకుండా పోయాడు. పిల్లాడి కోసం చుట్టుపక్కల వెతికిన నజర్, కుటుంబ సభ్యులు చివరకు మసీదుల్లోని మైకుల ద్వారా చాటింపు వేయించారు. దీంతో కొందరు యువకులు అక్కడున్న అన్ని ఇళ్లలో జల్లెడ పట్టారు. కానీ, ఫలితం లేకుండా పోయింది.
వారం తర్వాత కొందరు దుండగులు జైద్ తండ్రికి ఫోన్ చేసి తామే కిడ్నాప్ చేశామంటూ రూ.8 లక్షలు డిమాండ్ చేశారు. బాలుడి తండ్రి ఈ విషయాన్ని పోలీసులకు చెప్పటంతో వారు ప్రణాళిక రచించి నిందితుడు అఫ్తాబ్ను అరెస్ట్ చేశారు. అసలు నిందితుడు ఇర్ఫాన్ అని, వీరిద్దరూ జైద్ ఉంటున్న ప్రాంతంలోనే ఉంటారని దర్యాప్తులో వెల్లడైంది.
అయితే.. ఇందులో ఇంకో ట్విస్ట్ ఉంది. పోలీసులు అరెస్ట్ చేసిన నిందులు నిజంగా బాలుడ్ని కిడ్నాప్ చేయలేదట.బాలుడు తప్పిపోయిన విషయాన్ని తెలుసుకోని డబ్బు కోసం అలా బెదిరించారట. అయితే.. మరి ఎవరు బాలుడ్ని ఆ పెట్టలో పెట్టారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.