ఆర్ఎస్ఎస్ నాయకుడు వినాయక్ దామోదర్ సావర్కర్ పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ముంబైలో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. సావర్కర్ని అవమనించారని.. తక్షణం రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
ఆర్ఎస్ఎస్ నాయకుడు వినాయక్ దామోదర్ సావర్కర్ పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముంబైలో వారు నిరసన ప్రదర్శనకు దిగారు. దీనిలో భాగంగా రాహుల్ పోస్టర్లపై బూట్లు విసిరి, నల్లరంగు పూసి నిరసన తెలిపారు. బీజేపీ నేత రామ్ కదమ్ నేతృత్వంలో జూటా మారో ఆందోళన్’ పేరుతో ఈ నిరసనలు చేపట్టారు. సావర్కర్ని అవమనించారని.. తక్షణం రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
మరోవైపు.. బీజేపీ విమర్శలకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కౌంటరిచ్చారు. రాహుల్ గాంధీ ఫోటోని చెప్పులతో కొట్టాలని కర్ణాటకలో బీజేపీ చెప్పిందని.. చెప్పులు మాకు లేవా..? మేం కొట్టలేవా అంటూ జగ్గారెడ్డి ఫైరయ్యారు. దేవుళ్ల పేరుతో రాజకీయం చేయడం తప్పించి బీజేపీకి ఏం తెలుసునని ఆయన ప్రశ్నించారు. రాహుల్పై చెప్పులు వేస్తే.. మోడీ, అమిత్ షాలపై చెప్పులు పడతాయని జగ్గారెడ్డి హెచ్చరించారు.
కాగా... భారత స్వాతంత్య్ర సమరంలో వినాయక్ దామోదర్ సావర్కర్ బ్రిటీష్ వారికి సాయపడ్డారని, వారి నుంచి స్టైఫండ్ తీసుకున్నారని నిన్న రాహుల్ గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే. రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కర్ణాటకలో సాగుతున్న సంగతి తెలిసిందే. నేడు మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. దేశ విభజనకు కాంగ్రెస్దే బాధ్యత అని బీజేపీ చేస్తున్న ఆరోపణలపై అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ స్పందిస్తూ.. కాంగ్రెస్ నాయకులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి ఏళ్ల తరబడి జైలు జీవితం గడిపారని అన్నారు.
ALso REad:ఆర్ఎస్ఎస్ బ్రిటీష్ వారికి సాయం చేసింది.. సావర్కర్ వారి నుంచి స్టైఫండ్ తీసుకున్నారు: రాహుల్ గాంధీ
“చరిత్రపై నాకున్న అవగాహన ప్రకారం.. ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ వారికి సహాయం చేసింది. సావర్కర్ బ్రిటిష్ వారి నుంచి స్టైఫండ్ పొందారు. ఇవి చారిత్రక వాస్తవాలు’’ అని రాహుల్ అన్నారు. స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించి, దేశానికి రాజ్యాంగాన్ని అందించి హరిత విప్లవానికి నాంది పలికింది కాంగ్రెస్సే అని చెప్పారు. స్వాతంత్ర్య పోరాటంలో బీజేపీ ఎక్కడా లేదని విమర్శించారు. బీజేపీ ద్వేషాన్ని వ్యాపింపజేసి దేశాన్ని విడదీస్తోందని ఆరోపించారు.
మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. సంవత్సరాలుగా రాజకీయ నాయకులకు, పౌరులకు మధ్య దూరం ఏర్పడిందని అన్నారు. ‘‘ప్రజలతో కమ్యూనికేట్ చేయడానికి సులభమైన మార్గాలు ఉన్నాయి. నేను తపస్సును నమ్ముతాను. నా కుటుంబం తపస్సును నమ్ముతుంది. అందువల్ల మేము రోడ్డుపై పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాం. మీరు రోడ్డు మీద నడిచి, ప్రజలతో మాట్లాడినప్పుడు, కమ్యూనికేషన్ మెరుగ్గా ఉంటుంది. నాకు ఇది ఒక అభ్యాస అనుభవం. ఇప్పటికి 31 రోజులు మాత్రమే అయింది. ఈ కమ్యూనికేషన్ మోడ్ యొక్క ప్రయోజనాలను నేను ఇప్పటికే చూస్తున్నాను’’ అని అన్నారు.
