కాంగ్రెస్ భారత్ జోడో యాత్రకు పోటీగా బీజేపీ 'జన ఆక్రోశ్ యాత్ర'..!
Rajasthan: కాంగ్రెస్ భారత్ జోడో యాత్రకు పోటీగా బీజేపీ జన ఆక్రోశ్ యాత్రను చేపట్టనుంది. రాజస్థాన్ బీజేపీ చీఫ్ సతీష్ పూనియా, జన్ ఆక్రోశ్ యాత్ర సన్నాహక వర్క్షాప్ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు.
BJP-Jan Aakrosh Yatra: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ నేతృత్వంలో ముందుకు సాగుతున్న భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ క్రమంలోనే భారత్ జోడో యాత్రకు పోటీగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సైతం మరో యాత్రను ప్రారంభించనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ భారత్ జోడో యాత్రకు పోటీగా బీజేపీ జన ఆక్రోశ్ యాత్రను చేపట్టనుంది. రాజస్థాన్ బీజేపీ చీఫ్ సతీష్ పూనియా, జన ఆక్రోశ్ యాత్ర సన్నాహక వర్క్షాప్ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు.
రాజస్థాన్ లో రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర'ను ఎదుర్కొనేందుకు బీజేపీ 'జన ఆక్రోష్ యాత్ర'ను ప్రారంభించనుంది. రాజస్థాన్లో రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రకు పోటీగా బీజేపీ రాష్ట్ర యూనిట్ డిసెంబర్ 2 నుండి 'జన ఆక్రోష్ యాత్ర' చేపట్టనుంది. రాష్ట్రంలోని మొత్తం 200 నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగనుందని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర డిసెంబర్ 3 లేదా 4న రాజస్థాన్ లోకి ప్రవేశించనుంది. బీజేపీ జన ఆక్రోష్ యాత్రతో ఆ పార్టీ ప్రతి గ్రామానికి చేరుకునే అవకాశం ఉంది.
జన్ ఆక్రోష్ యాత్ర సన్నాహాల కోసం ఏర్పాటు చేసిన వర్క్ షాప్ లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి రాష్ట్ర బీజేపీ చీఫ్ సతీష్ పూనియా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, రాహుల్ గాంధీలపై విమర్శలు గుప్పించారు. "రాజస్థాన్లో ఆసుపత్రిలో శిశువు పిండాన్ని కుక్కలు తీసుకెళ్లటం ఎవరూ ఊహించలేదు. 35000 రూపాయల కోసం, ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది, రాష్ట్రంలో రోజూ మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి.. ఒక మహిళను 35 ముక్కలుగా చేసి హత్య చేయడం సాధారణమని ఎవరూ ఊహించలేదు" అని పేర్కొన్నారు.
అలాగే, ‘నిరుద్యోగంలో రాజస్థాన్ అగ్రస్థానంలో ఉంది.. 70 లక్షల మంది విద్యార్థులు పరీక్ష పెట్టారు. లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చామని సీఎం చెబుతున్నారు.. మిగతా 69 లక్షల మంది గురించి ఏమంటారు? ప్రతి 12 కిలోమీటర్లకు ఓ అవినీతి అధికారి ఇరుక్కున్నారు.. రాజస్థాన్ నేరాలకు రాజధానిగా మారింది" అని ఆరోపించారు. రాహుల్ గాంధీపై కూడా పూనియా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని ఆరోపించారు. "జిన్నాతో పాటు భారతదేశాన్ని విభజించాలనేది నెహ్రూ కోరిక. రైతుల రుణాలను మాఫీ చేయాలని నేను కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. 60 లక్షల మంది రైతులు ఇప్పటికీ రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు" అని అన్నారు.