రాజస్తాన్లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే రాజస్తాన్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఏదో ఒక ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతూనే ఉంది.
రాజస్తాన్లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికలకు ముందే అక్కడ రాజకీయం హాట్ హాట్గా మారుతుంది. రాజస్తాన్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఏదో ఒక ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతూనే ఉంది. ఇప్పటికే రాజస్తాన్ కాంగ్రెస్లో అంతర్గత విబేధాలు కొనసాగుతుండగా.. తాజాగా సీఎం అశోక్ గెహ్లాట్ తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. ఇది కాస్తా బురఖా వర్సెస్ ఘూంఘట్ (ముసుగులు)గా మారింది. అసలేం జరిగిందంటే.. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం అశోక్ గెహ్లాట్ మహిళ ఘూంఘట్ను తొలగించడంపై రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ తన వ్యతిరేకతను వ్యక్తం చేసింది.
ఇందుకు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసిన బీజేపీ నేతలు.. కాంగ్రెస్ బురఖాపై మాట్లాడటం మానేసిందని విమర్శలు గుప్పించారు. ఆ వీడియోలో అశోక్ గెహ్లాట్ ఒక మహిళ ఘూంఘట్ను తొలగించడం కనిపిస్తోంది. అందే సమయంలో ఘూంఘట్ల కాలం పోయిందని చెప్పడం కూడా వినిపించింది. అదే సమయంలో వేదికపైకి ఒక ముస్లిం మహిళను కూడా అశోక్ గెహ్లాట్ కలిశారు. అయితే ఆమెతో బురఖా గురించి అశోక్ గెహ్లాట్ ఏం మాట్లాడలేదని బీజేపీ విమర్శలు గుప్పించారు.
రాజస్తాన్ సీఎం గెహ్లాట్ను టార్గెట్ చేసిన బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్.. తేడా స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. కాంగ్రెస్ సీఎం (అశోక్ గెహ్లాట్) మహిళల ముసుగును బలవంతంగా ఎత్తివేస్తున్నారని.. కానీ బురఖాల విషయం రాగానే మౌనంగా ఉండిపోయారని విమర్శించారు. హైకమాండ్ (కాంగ్రెస్) కూడా హిజాబ్కు మద్దతు ఇస్తుందని ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ అన్నారు. అలాగే దేశాన్ని నాశనం చేసే పని కాంగ్రెస్ చేసిందని విమర్శలు గుప్పించారు. ఈ వైఖరి వంచన కాకపోతే.. మరి ఏమిటి? అని ప్రశ్నించారు.
అదే సమయంలో రాజస్థాన్ బీజేపీ నాయకుడు లక్ష్మీకాంత్ భరద్వాజ్ ఈ మొత్తం అంశంపై సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడుతున్నది సరైనదని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అయితే ఈ వివాదంపై ఇప్పటివరకు కాంగ్రెస్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
