userpic
user icon
0 Min read

అమిత్ షా ఏం ప్లాన్ స్వామీ నీది.. ఆంధ్రప్రదేశ్ ఫార్ములా తమిళనాడులో!! - ఎడిటర్స్ కామెంట్

BJP Replicates Andhra Pradesh Formula in Tamil Nadu Nainar Nagendran Named State BJP Chief as AIADMK Alliance Finalized Ahead of 2026 Elections
Union Home Minister Amit Shah (Photo/X/@AmitShah)

Synopsis

 BJP - AIADMK Alliance:  2023లో విబేధాల కారణంగా విడిపోయిన బీజేపీ-ఎఐఏడీఎంకే మళ్లీ కలవడం ఇప్పటి తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్‌ను ఓడించాలన్నే లక్ష్యంతో అమిత్ షా – ఎడప్పాడి కె.పళనిస్వామి (EPS) మధ్య మార్చి 25న భేటీ జరిగింది. ఈ భేటీతో పొత్తు పునరుద్ధరణకు బలమైన సంకేతాలు వచ్చాయి.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-తెలుగుదేశం-జనసేన అలయన్స్ విజయవంతమైంది. ఈ ఎన్‌డీఏ కూటమికి ప్రజలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి 164 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేయడంతో జగన్ పార్టీ వైసీపీ  అత్యంత దారుణంగా ఓడిపోయింది. ఇదే ఫార్ములాను ఇప్పుడు తమిళనాడులో కూడా అనుసరించే ప్రయత్నంలో బీజేపీ ఉంది.

2023లో విబేధాల కారణంగా విడిపోయిన బీజేపీ-ఎఐఏడీఎంకే మళ్లీ కలవడం ఇప్పటి తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్‌ను ఓడించాలన్నే లక్ష్యంతో అమిత్ షా – ఎడప్పాడి కె.పళనిస్వామి (EPS) మధ్య మార్చి 25న భేటీ జరిగింది. ఈ భేటీతో పొత్తు పునరుద్ధరణకు బలమైన సంకేతాలు వచ్చాయి.

AIADMK BJP పొత్తు

తమిళనాడు రాజకీయాలు ఆసక్తికర దశలోకి దూసుకెళ్తున్నాయి. ఒకవైపు ఎఐఏడీఎంకేతో బీజేపీ పొత్తు అధికారికంగా ఖరారైంది.

2023లో జరిగిన చేదు పరిణామాల తర్వాత ఎఐఏడీఎంకే, బీజేపీ పొత్తు తెగిపోయింది. అయితే, తాజాగా చెన్నైలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేరుగా ఎఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (EPS) తో సమావేశమై పొత్తును అధికారికంగా ప్రకటించారు. 2026లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిని ఎదుర్కొనేందుకు ఇది ఒక మంచి వ్యూహాత్మక నిర్ణయంగా చెప్పవచ్చు.

వైఫల్యాల తర్వాత గుణపాఠం… తిరిగి ఒక్కటైన ఎన్డీఏ పార్టీలు

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, ఎఐఏడీఎంకే వేర్వేరుగా పోటీ చేయడంతో, డీఎంకే ఆధ్వర్యంలోని కూటమి భారీ విజయాన్ని సాధించింది. ఎఐఏడీఎంకే చాలా నియోజకవర్గాల్లో డిపాజిట్‌ కోల్పోయింది. ఈ ఫలితాల ఆధారంగా రెండు పార్టీలు స్పష్టంగా తెలుసుకున్న విషయం ఏంటంటే.. విడివిడిగా పోటీ చేస్తే డీఎంకేను ఓడించడం అసాధ్యం.

ఈ నేపథ్యంలోనే రాజకీయ అవసరాలు, భవిష్యత్ గెలుపు సాధ్యం చేసే కూటమిగా ఎన్డీఏ మళ్లీ రూపుదిద్దుకుంది. ఈసారి కేవలం ఎన్నికల ఒప్పందమే కాదు, కాకుండా బీజేపీ తమిళనాడు నేతృత్వంలోనూ మార్పులు చేస్తూ నయినార్ నాగేంద్రన్‌ను రంగంలోకి దించింది.

బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా నయినార్ నాగేంద్రన్

నయినార్ నాగేంద్రన్, బీజేపీ సీనియర్ నేత, ఇకపై తమిళనాడు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్నారు. పార్టీ ఆఫీసులో ఆయన ఒక్కరే నామినేషన్ వేసిన నేపథ్యంలో ఆయన ఎన్నిక దాదాపు ఖరారైనట్లే.
గతంలో పదవిలో ఉన్న కె. అన్నామలై కొన్ని రోజుల క్రితమే తన రాజీనామా ప్రకటించారు. పొత్తు వ్యూహాల నేపథ్యంలో ఆయనను పక్కకు జరిపి, పార్టీకి మృదువైన ముఖచిత్రంగా నాగేంద్రన్‌ను ముందుకు తేవాలని హైకమాండ్ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది.

అన్నామలై – EPS మధ్యవిభేదాలు, శాంతి యత్నాలు

అన్నామలై తన పదవిలో ఉన్నప్పుడు ఎఐఏడీఎంకేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, డ్రావిడియన్ ఉద్యమ నాయకుడు అన్నాదురైపై అనవసర వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. అదే సమయంలో EPS కూడా బీజేపీని "వెస్ట్ లగేజ్"గా అభివర్ణించారు.
ఈ వ్యాఖ్యలు పార్టీలు విడిపోవడానికి ముఖ్య కారణాలుగా నిలిచినప్పటికీ, ఇటీవల అన్నామలై “ఎడప్పాడి అన్నయ్య” అంటూ మాట్లాడటం, బీజేపీ నేతలు బహిరంగంగా పొత్తును స్వాగతించడం, సంబంధాలను మెరుగుపరిచే సంకేతాలుగా కనిపించాయి.

విజయ్ పార్టీ: జయాపజయాలను నిర్దేశించే తమిళగ వెట్రి కళగం

ఇప్పటివరకు సస్పెన్స్‌గా ఉన్న అంశం – తమిళగ వెట్రి కఝగం (TVK) పార్టీ అధినేత విజయ్ తీసుకునే నిర్ణయం. ఆయన పార్టీ తొలి అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా 5 శాతం ఓట్లు పొందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే విజయ్ ఇప్పటికీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న డ్రావిడియన్ స్టాండ్‌లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కల్యాణ్ లాగా విజయ్ పార్టీ తమిళనాడు ఎన్నికల్లో ఆయా పార్టీలు కూటముల జయాపజయాలను విపరీతంగా ప్రభావితం చేయగలదు. ఒకవేళ విజయ్ ద్రవిడ స్టాండ్ కే కట్టుబడి బీజేపీకి అన్నాడీఎంకే కూటమికి వ్యతిరేకంగా పోటీ చేస్తే.. ఆ ప్రభావం అధికార డీఎంకే పార్టీ పై పడుతుంది. అధికార పార్టీ ఓట్లలో చీలిక వస్తుంది. దీంతో డీఎంకే ఓట్ల శాతం తగ్గిపోతుంది. అది అన్నాడీఎంకే, బీజేపీకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా చివరి క్షణంలో విజయ్ గనుక ఒకవేళ అన్నాడీఎంకే, బీజేపీ తో కలిసి ఎన్నికలకు వెళ్తే.. అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు బలపడంతో పాటు.. విజయ్ కి ఉన్న అయిదు శాతం, యువత ఓట్లు ఈ కూటిమికి విజయావకాశాలు మారుతాయి. మొత్తానికి విజయ్ ఏ స్టాండ్ తీసుకున్నా.. అన్నాడీఎంకే, బీజేపీ పొత్తుకే ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే విజయ్ పార్టీ పెట్టడం అన్నాడీఎంకేకి కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు.

డీఎంకే వ్యూహాలు: హిందీ వ్యతిరేకత, కేంద్రంపై విమర్శలతో కౌంటర్

  • ముఖ్యమంత్రి స్టాలిన్ ఇప్పటికే కేంద్రంపై విమర్శలదాడిని వేగవంతం చేశారు.
  • హిందీని మళ్లీ రాజకీయ ఆయుధంగా వాడటం,
  • న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి వ్యతిరేకత,
  • వక్ఫ్ బిల్లు సవరణలపై సర్కార్ స్టాండ్,
  • ఈ అంశాలన్నీ కేంద్రానికి వ్యతిరేకంగా డీఎంకే క్యాడర్‌ను కలిపే ప్రయత్నం.

అయినా సరే, మూడేళ్ల పాలన తర్వాత ఎదురయ్యే యువతలో నిరుద్యోగ సమస్య, అధిక ధరలు, వ్యవస్థలపై అసంతృప్తి వంటి అంశాలు డీఎంకేకు మైనస్ అవుతాయన్న అంచనాలు కూడా ఉన్నాయి.

మొత్తానికి… తమిళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి

ఈ పొత్తుతో ఎఐఏడీఎంకేకు కొత్త ఉత్సాహం, బీజేపీకి తమిళనాడులో కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. మరోవైపు, విజయ్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నదే ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల్లో ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది.

ఇది ఇక విడిపోతే విఫలం – కలిస్తే అవకాశాలే అవకాశాలు అన్న స్థితిలో బీజేపీ, ఎఐఏడీఎంకే కలిసి ముందుకెళ్తున్న కూటమి. వచ్చే నెలలలో అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలు, TVK స్టాండ్ వంటి అంశాలు తమిళనాడు ఎన్నికల దిశను మలుపు తిప్పనున్నాయి.

Venugopal  Bollampalli
About the Author

Venugopal Bollampalli

వేణుగోపాల్ బొల్లంపల్లి అనుభవజ్ఞుడైన సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, డిజిటల్, టెలివిజన్ మీడియాలలో 18 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగి ఉన్నారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగుకు ఎడిటర్‌గా ఉన్నారు. ఇంతకు ముందు బిగ్ టీవీ డిజిటల్ హెడ్‌గా, BBCలో డిప్యూటీ ఎడిటర్‌గా లీడరషిప్ రోల్స్ లో పని చేశారు. ఈయన ఈనాడులో 12 సంవత్సరాలకుపైగా సుదీర్ఘ కాలం పని చేశారు. అక్కడ రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా పనిచేశారు. రొటీన్‌గా కాకుండా ప్రజలకు పనికొచ్చేలా అధిక నాణ్యత కలిగిన వార్తలను, కథనాలను, ప్రాడెక్ట్‌ను తీర్చిదిద్దడం ఈయన సంపాదకీయ వ్యూహాల్లో ప్రధానంగా గమనించవచ్చు.Read More...

Latest Videos