తెర పైకి ఆర్ఎస్ఎస్ ఖాకీ నిక్కర్ వివాదం.. అసలేం జరిగిందంటే..?
కాంగ్రెస్ పార్టీ చేస్తుంది 'భారత్ జోడో యాత్ర కాదనీ, అగ్నిమాపక యాత్ర అని కాంగ్రెస్ చేసిన ట్వీట్పై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్లు ఒకరినొకరు టార్గెట్ చేసుకునే ఒక్క అవకాశాన్ని కూడా వదలడం లేదు. ఇప్పుడు మరో వివాదం తెర మీదికి వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రనే 'భారత్ జోడో. ఈ యాత్రకు దేశవ్యాప్తంగా భారీ స్పందన వస్తోంది. అయితే.. ఈ యాత్రను ప్రారంభం నుంచే బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ కూడా బీజేపీ విమర్శలను తీవ్రంగా తిప్పికొడుతోంది. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య మాటల యుద్దం సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్లు ఒకరినొకరు టార్గెట్ చేసుకునే క్రమంలో ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలడం లేదు. తాజాగా కాంగ్రెస్ పార్టీ వివాదాస్పద ట్వీట్ చేయడంతో మరో వివాదం తెర మీదకు వచ్చింది.
అసలేం జరిగిందంటే..?
కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ఓ వివాదాస్పద పోస్టును పార్టీ పోస్టు చేసింది. ఆ ట్విట్ లో రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్) కార్యకర్తలు ధరించే ఖాకీ నిక్కర్ కు మంటలు అంటుకున్నట్లు పోస్టు పెట్టింది. అంతేకాకుండా.. ద్వేషం నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు, బీజేపీ-ఆర్ఎస్ఎస్ వ్యాప్తి చేస్తున్న ద్వేషపూరిత శృంఖలాల నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు, ఒక్కొక్క అడుగు వేసి లక్ష్యాన్నిచేరుకోనున్నట్లు.. ఇంకా 145 రోజులు ఉన్నాయంటూ ఆ ఫోటోకు నినాదాన్ని జోడిస్తూ.. కాంగ్రెస్ పార్టీ తన ట్వీట్లో పేర్కొన్నది. నిజానికి ఇది ఆర్ఎస్ఎస్పై ప్రతీకాత్మకమైన అవహేళన. దీనిపై బీజేపీ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి దూకుడుగా వ్యవహరిస్తూ వెంటనే ఈ పోస్టును తొలగించాలని కాంగ్రెస్ను కోరింది.
ఆ పోస్టును తొలగించాలని బీజేపీ డిమాండ్
ఆ పోస్టును వెంటనే తొలగించాలని బిజెపి డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని, అందుకే ఇలాంటి వివాదాస్పద ట్వీట్ చేసిందని విమర్శించారు. ఇది భారత్ జోడో యాత్ర కాదనీ, నిజానికి అగ్నిమాపక యాత్ర.. అని విమర్శించారు. రాహుల్ యాత్రను 'ఇండియా బ్రేక్ యాత్ర'గా అభివర్ణించారు. ఈ పోస్టును కాంగ్రెస్ వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఇది కాంగ్రెస్ ‘బర్న్ ద ఫైర్ ఉద్యమం’ అని బీజేపీ పేర్కొంది.
బీజేపీకి కాంగ్రెస్ భయం పట్టుకుంది
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ స్పందించారు. టీ-షర్ట్, లోదుస్తులపై చేసిన ఈ వ్యాఖ్య పూర్తిగా పిల్లతనం అని ఆయన అన్నారు. అసలు విషయం చెబితే.. మీరు నవ్వుకుంటారు' అని రమేష్ ఈ విషయం గురించి మాట్లాడేందుకు నిర్ద్వంద్వంగా నిరాకరించాడు. బీజేపీ దీన్ని ఇష్యూగా మార్చుకోవాలనుకుంటుందనీ, దీని బట్టి వాళ్లు ఎంత చులకనగా వ్యవహరిస్తున్నారనేది అర్థమవుతోందని అన్నారు.