కేసీఆర్ కుటుంబానికి సంబంధం లేకపోతే బండి సంజయ్ను ఎందుకు అరెస్ట్ చేశారు?: బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది
ఢిల్లీలో లిక్కర్ స్కామ్లో సీఎం కేసీఆర్ సీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఢిల్లీ బీజేపీ నేతలు ఆరోపణలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే మరోసారి టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్దం నడుస్తోంది.
ఢిల్లీలో లిక్కర్ స్కామ్లో సీఎం కేసీఆర్ సీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఢిల్లీ బీజేపీ నేతలు ఆరోపణలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే మరోసారి టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. అయితే లిక్కర్ స్కామ్తో తనకు ఎలాంటి సంబంధం లేదని కవిత స్పష్టం చేశారు. అయితే బీజేపీ నేతలు మాత్రం సీఎం కేసీఆర్ కుటుంబం టార్గెట్గా విమర్శల దాడిని పెంచారు. దీంతో తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.
తాజాగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ నేతలు.. తాము ఆరోపణలు చేస్తే కవిత ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది మాట్లాడుతూ.. ఎంపీగా బండి సంజయ్కు నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పాత్రపై సీబీఐ విచారణ జరుగుతోందని అన్నారు. కేసీఆర్కు కుటుంబానికి సంబంధం లేకపోతే బండి సంజయ్ను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశంతోనే తెలంగాణలో బీజేపీ నేతలను అరెస్ట్లు చేయిస్తున్నారని ఆరోపించారు.
ఇదిలా ఉంటే.. లిక్కర్ స్కామ్ కేసుతో తనకు సంబంధం ఉందని ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, ఆ పార్టీ నాయకుడు మంజీందర్ సింగ్ సిర్సాపై కల్వకుంట్ల కవిత హైదరాబాద్ కోర్టులో పరువునష్టం కేసు వేశారు. ఇక, తనపై ఆరోపణలపై ఏ విచారణకైనా తాను సిద్ధమని కవిత ప్రకటించారు. దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానని చెప్పారు.