కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం: 10 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
కర్ణాటక అసెంబ్లీ నుండి బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.

బెంగుళూరు: కర్ణాటక అసెంబ్లీనుండి పది మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. సస్పెండైన ఎమ్మెల్యేలను మార్షల్స్ సహాయంతో బయటకు తరలించారు. మరో వైపు అసెంబ్లీ ఆవరణలోనే బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.బీజేపీకి చెందిన డాక్టర్ సీఎన్ ఆశ్వత్ నారాయణ్, వి. సునీల్ కుమార్, ఆర్. ఆశోక్, అరగ జ్ఞానేంద్ర, వేదవ్యాస్ కామత్, యశ్ పాల్ సువర్ణ, అరవింద్ బెల్లాడ్, దేవరాజ్ మునిరాజ్, ఉమానాథ్ కొట్యాన్, భరత్ శెట్టిలను సస్పెండ్ చేశారు.
బెంగుళూరులో జరిగిన విపక్ష పార్టీల సమావేశానికి ఐఎఎస్ అధికారులతో స్వాగతం పలకడంపై అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనలకు దిగారు. అయితే ఈ విషయమై సీఎం సిద్దరామయ్య చెప్పిన సమాధానానికి బీజేపీ ఎమ్మెల్యేలు సంతృప్తి చెందలేదు. సభలో ఆందోళనను కొనసాగించారు. ఈ గందరగోళం మధ్యే ప్రభుత్వం ఐదు బిల్లును ఆమోదించింది.ఈ బిల్లులను ఆమోదించిన వెంటనే సభను మధ్యాహ్నానికి వాయిదా వేయకుండా బడ్జెట్ పై చర్చించాలని స్పీకర్ యూటీ ఖాదర్ నిర్ణయించారు. సభా కార్యక్రమాలను డిప్యూటీ స్పీకర్ ను ఆదేశించారు.
ఇదిలా ఉంటే ఆమోదం పొందిన బిల్లుల కాపీలను చింపి కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు డిప్యూటీ స్పీకర్ పై విసిరారు. దీంతో సభ నుండి 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు డిప్యూటీ స్పీకర్ రుద్రప్ప లమాని.మరో వైపు విపక్ష కూటమి సమావేశానికి ఐఎఎస్ అధికారుల నియామకంపై అసెంబ్లీలో జనతాదళ్(సెక్యులర్) ఎమ్మెల్యేలు కూడ ఆందోళనకు దిగారు.
కొందరు ఎమ్మెల్యేలు డిప్యూటీ స్పీకర్ పై కాగితాలు విసరడంతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. డిప్యూటీ స్పీకర్ ను రక్షించేందుకు మార్షల్స్ ఆయన చుట్టూ రక్షణ వలయంగా నిలిచారు. పోడియం ముందు రచ్చ చేశారు. దీంతో 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెండ్ చేశారు. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల ప్రవర్తనను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఖండించారు.
ఇవాళ ఉదయం బీజేపీ, జనతాదళ్ (ఎస్) సభ్యులు వెల్ లో నిరసనలకు దిగారు. అయితే అదే సమయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు బిల్లులు సభలో ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందాయి.