బీజేపీ అంటే అవినీతి, కల్తీ మద్యం: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు
Arvind Kejriwal: బొటాడ్, అహ్మదాబాద్ జిల్లాల్లో ఇటీవల జరిగిన హూచ్ విషాదంలో ఇప్పటివరకు 43 మంది మరణించారనీ, గుజరాత్ లో మద్యం నిషేధం చట్టం ఉన్నప్పటికీ బహిరంగంగా మద్యం అమ్ముతున్నారని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
Gujarat: గుజరాత్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య ప్రత్యక్ష పోటీ అని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ దాని ఔచిత్యాన్ని కోల్పోయిందనీ, దానికి ఓటు వేయడం వల్ల ప్రయోజనం లేదని తెలిపారు. రానున్న ఎన్నికలకు ముందే ఆ పార్టీ నాయకులు అధికార బీజేపీలో చేరడంతో ముగుస్తుందని పేర్కొన్నారు. బొటాడ్, అహ్మదాబాద్ జిల్లాల్లో ఇటీవల జరిగిన హూచ్ విషాదంలో ఇప్పటివరకు 43 మంది మరణించారనీ, గుజరాత్ లో మద్యం నిషేధం చట్టం ఉన్నప్పటికీ బహిరంగంగా మద్యం అమ్ముతున్నారని చెప్పారు. ఈ క్రమంలోనే బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ అంటేనే అవినీతి, కల్తీ మద్యం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికలను ప్రస్తావిస్తూ.. "ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ మధ్య పోటీ. AAP అంటే కొత్త రాజకీయాలు, కొత్త ముఖాలు, కొత్త ఆలోచనలు, ఉత్సాహం, శక్తి మొదలైనవాటితో నిజాయితీ, దేశభక్తి ఉన్న పార్టీ అని అర్థం. బీజేపీ అంటే నకిలీ మద్యం, అవినీతి అని ఛోటా ఉదయ్పూర్ జిల్లాలోని బోడెలిలో జరిగిన సభలో కేజ్రీవాల్ అన్నారు. అలాగే, కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన.. “చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే బీజేపీలో చేరారు. ఎన్నికల ముందు చాలా మంది చేరనున్నారు. ఎన్నికల తర్వాత కూడా వారు తప్పకుండా బీజేపీలో చేరుతారు. గుజరాత్ కాంగ్రెస్ త్వరలో గుజరాత్ బీజేపీలో విలీనం కాబోతున్నట్లు కనిపిస్తోంది. అయితే, వారి ప్రేమ కథ రాజకీయాలు ముగియబోతున్నాయి ఎందుకంటే ప్రజల రాజకీయాలు ప్రారంభం కాబోతున్నాయి" అని అన్నారు.
ఈ ఏడాది డిసెంబర్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నయి. ఈ క్రమంలోనే ఇప్పటినుంచే ప్రచారం దూకుడు కొనసాగిస్తోంది ఆప్. ప్రస్తుతం కేజ్రీవాల్ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. “గుజరాత్లో మద్యం ప్రతిచోటా దొరుకుతుంది. ఇది బహిరంగ ప్రదేశాలలో, గ్రామాలు, వీధులు, నగరాల్లో విక్రయిస్తారు. గుజరాత్లో నిషేధం ఉందని వారు అంటున్నారు. అలాంటప్పుడు వేల కోట్ల రూపాయల మద్యాన్ని ఎవరు అమ్ముతున్నారు? ఈ వ్యాపారాన్ని ఎవరు నిర్వహిస్తారు, ఎవరు డబ్బు సంపాదిస్తారు? ” అంటూ ప్రశ్నించారు. ప్రజలు తమకు ఓటేస్తే బీజేపీ వారి పిల్లలకు మద్యం తాగించేలా చేస్తుందని కేజ్రీవాల్ ఆరోపించారు. "వారు మీ పిల్లలకు నకిలీ మద్యం తాగించేలా చేస్తారు. వారికి ఓటు వేస్తే ఈ అక్రమ మద్యం వ్యాపారం కొనసాగుతుంది" అని అన్నారు.
“మిమ్మల్ని ప్రభావితం చేసే సమస్యల గురించి మాట్లాడేందుకు నేను ఇక్కడికి వచ్చాను. నాకు రాజకీయాలు తెలియవు. పురోగతిని ఎలా తీసుకురావాలో మాత్రమే నాకు తెలుసు. నేను కూడా సామాన్యుడినే. కేజ్రీవాల్ గురించి పదేళ్ల క్రితం దేశంలో ఎవరికీ తెలియదు. అందుకే సామాన్యుడి సమస్య నాకు అర్థమైంది” అని కేజ్రీవాల్ అన్నారు. “ఒక సామాన్యుడు డబ్బు సంపాదించడం, వారి కుటుంబాన్ని చూసుకోవడం చాలా కష్టం. ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయిలో ఉంది. నేను ఉచిత విద్యుత్, విద్య, ప్రజారోగ్య సేవలను అందిస్తానని హామీ ఇచ్చినప్పుడు.. నాపై చాలానే విమర్శలు గుప్పించారు. నాపై డబ్బులు దోచుకుంటున్నారని, ఉచితాలు పంచుతున్నారని ఆరోపించారు. నాకు స్విస్ బ్యాంక్ ఖాతా లేదు.. నేను అక్కడ డబ్బును డిపాజిట్ చేయబోవడం లేదు, ఎందుకంటే అది ప్రజల సొమ్ము" అంటూ కేజ్రీవాల్ పేర్కొన్నారు.