బీజేపీ నేతలు చెప్పే ఆ మూడు అబద్ధాలు తేటతెల్లమయ్యాయి: మల్లికార్జున్ ఖర్గే విమర్శలు
నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం, మహిళా రెజ్లర్ల నిరసనను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్న తీరును పేర్కొంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్రంపై విరుచుకుపడ్డారు. బీజేపీ, ఆరెస్సెస్ నేతలు చెప్పే మూడు అబద్ధాలు ఈ ఘటనలతో తేలిపోయాయని వివరించారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆదివారం కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం, మల్లయోధుల నిరసనను ఢిల్లీ పోలీసులు కఠినంగా అడ్డుకున్న తీరును పరోక్షంగా ఉటంకిస్తూ ట్వీట్ చేశారు. నూతన పార్లమెంటును ప్రారంభించాల్సిన హక్కును రాష్ట్రపతి నుంచి ప్రధాని మోడీ లాక్కున్నారని విమర్శలు చేశారు. మరో వైపు నియంతృత్వ శక్తులు మహిళా మల్ల యోధులపై దాడి చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనలు బీజేపీ, ఆరెస్సెస్ నేతలు చెప్పే మూడు అబద్ధాలను తేటతెల్లం చేశాయని తెలిపారు. ప్రజాస్వామ్యం, జాతీయవాదం, కూతుళ్లను కాపాడదాం అని వారు ఇన్నాళ్లు అబద్ధాలే చెప్పారని ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు.
‘ప్రధాని మోడీ గారు గుర్తుంచుకోండి, ప్రజాస్వామ్యం కేవలం భవంతులతో నడవదు.. అది ప్రజా గొంతుకతో నడుస్తుంది.’ అంటూ ఆయన ఘాటుగా విమర్శించారు.
ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Also Read: Opposition Unity: 2024 ఎన్నికల వ్యూహం కోసం 12న ప్రతిపక్షాల భారీ సమావేశం
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ పై మహిళా మల్ల యోధులు లైంగిక ఆరోపణలు చేశారు. ఆయనను డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ నుంచి తొలగించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద రెండోసారి ధర్నాకు కూర్చున్నారు. ఈ రోజు వారు మహిళా సమ్మాన్ పంచాయత్ నిర్వహించాలని ప్లాన్ వేసుకున్నారు. పోలీసులు బారికేడ్లను దాటి ముందుకు సాగడంతో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.
ఢిల్లీ పోలీసులు ఆ మహిళా రెజ్లర్లపై జులూం చూపించారు. రోడ్డుపై వారిని ముందుకు సాగనివ్వకుండా అడ్డుకున్నారు. ఈడ్చుకెళ్లి పోలీసు వాహనాల్లో ఎక్కించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ వీడియోలపై స్పందిస్తూ దారుణం అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. కాగా, అధికార పక్షానికి సానుభూతిగా ఉండే చాలా మంది ఢిల్లీ పోలీసులను మెచ్చుకుంటూ కామెంట్లు చేశారు.