కాంగ్రెస్లో ప్రశాంత్ కిషోర్ చేరకపోవడంపై బీజేపీ స్పందించింది. కాంగ్రెస్ పార్టీకి కుటుంబాన్ని కాపాడుకోవడమే ముఖ్యమని అందుకే పీకే ఇచ్చిన సూచనలతో కంగుతిన్నారని బీజేపీ నేత షెహజాద్ పూనావాలా దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పార్టీలో (congress party) ప్రశాంత్ కిశోర్ (prashant kishor) చేరతాడా.. లేదా అంటూ గత కొంతకాలంగా సాగుతున్న ప్రచారానికి మంగళవారంతో తెరపడింది. పీకే కాంగ్రెస్లో చేరడం లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా (randeep surjewala) వెల్లడించారు. ఆ కాసేపటికే దీనిని ధృవీకరిస్తూ ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. ఈ వ్యవహారంతో రాజకీయ వర్గాలు రకరకాలుగా స్పందిస్తున్నాయి. తాజాగా బీజేపీ స్పందించింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను చేర్చుకోవాలన్న కాంగ్రెస్ ప్రయత్నం ఫలించని విషయాన్ని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా (shehzad poonawalla) ప్రస్తావించారు.
‘‘ఉత్పత్తి చెడ్డది అయితే దాన్ని విక్రయించే వాడు మంచోడా, చెడ్డోడా అన్నది కాదు. ఆ ఉత్పత్తిని విక్రయించలేరు. గతంలోనే కాలం చెల్లిపోయిన వారసత్వ రాజకీయాలనే ఉత్పత్తిని విక్రయించలేరు. పరివార్ బచావో (కుటుంబాన్ని కాపాడుకోవడం) అనేదే కాంగ్రెస్ పార్టీ అజెండా. పార్టీ బచావో (పార్టీని కాపాడు) కాదు. అందుకే పార్టీలో మార్పులు, నిర్మాణాత్మక సంస్కరణలపై పీకే ఇచ్చిన సూచనలతో కంగుతిన్నారు’’ అని పూనవాలా దెబ్బిపొడిచారు.
మరో బీజేపీ నేత.. గురు ప్రకాష్ పాశ్వాన్ (guru prakash paswan) స్పందిస్తూ.. పీకే సాధించిందేమిటి? అని ప్రశ్నించారు. మీడియానే పీకేను సెలబ్రిటీగా మార్చేసిందన్నారు. ‘‘రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో వెండర్లను (విక్రేతలు) వినియోగించుకుంటాయి. ఆయన (ప్రశాంత్ కిషోర్ ) కూడా ఒక వెండరే. పంజాబ్, యూపీ, ఇతర ప్రదేశాల్లో అతడి ట్రాక్ రికార్డును చెక్ చేసుకోండి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపాన్ని ఎదుర్కొంటోందా? బయటి వ్యక్తులను నియమించుకోవాలని అనుకుంటోందా?’’ అని పాశ్వాన్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధిష్టానంతో చర్చల సందర్బంగా తనకు ఫ్రీ హ్యాండ్ (పార్టీలో స్వేచ్చ) ఇవ్వాలని పీకే కోరినట్టుగా సమాచారం. 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు కొత్త ముఖం, పరివర్తన వ్యుహం అవసరమని పీకే చేసిన సిఫార్సులకు కాంగ్రెస్ అధిష్టానం అంతర్గతంగా అంగీకరించినప్పటికీ.. స్వేచ్చనిచ్చేందుకు నిరాకరించిందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అయితే కాంగ్రెస్కు, ప్రశాంత్ కిషోర్ మధ్య.. సఖ్యత కుదరకపోవడానికి మరికొన్ని కారణాలు కూడా రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.
