బీజేపీ గంగ వంటిది.. వచ్చి చేరితే పాపాలు పోతాయి: లెఫ్ట్ నేతలకు త్రిపుర సీఎం మాణిక్ సాహా అప్పీల్
బీజేపీ గంగా నది వంటిదని, గంగా నదిలో తలమునకేస్తే పాపాలు తొలగిపోయినట్టే బీజేపీలో చేరితే కూడా పాపాలు పోతాయని త్రిపుర సీఎం మాణిక్ సహా ప్రతిపక్షంలోని వామపక్ష నేతలకు పిలుపు ఇచ్చారు. ఇప్పటికీ స్టాలిన్, లెనిన్ భావజాలంలో విశ్వాసమున్న వారు వచ్చి బీజేపీలో చేరాలని అన్నారు.
అగర్తలా: త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరగనున్నాయి. ఈ తరుణంలో పార్టీల క్యాంపెయిన్ మెల్లగా వేడెక్కుతున్నది. సమీకరణాల పై పార్టీలు దృష్టి కేంద్రీకరించాయి. ఇందులో భాగంగానే ఏకంగా త్రిపుర సీఎం మాణిక్ సాహా ప్రతిపక్షంలోని వామపక్ష నేతలను తమ పార్టీలో చేరాలని అప్పీల్ చేశారు. బీజేపీ గంగా నది వంటిదని, ఇందులో వచ్చి మునకేస్తే వారి పాపాలు అన్నీ తొలగిపోతాయని అన్నారు.
దక్షిణ త్రిపురలోని కాక్రాబన్లో జన్ విశ్వాస్ ర్యాలీలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా గెలిచి తీరుతుందనే నమ్మకం ఉన్నట్టు తెలిపారు.
‘ఇప్పటికీ స్టాలిన్, లెనిన్ భావజాలంలో విశ్వాసం ఉంచినవారు బీజేపీలో చేరాలని నేను అప్పీల్ చేస్తున్నాను. ఎందుకంటే బీజేపీ గంగ వంటిది. గంగలో పవిత్ర స్నానం ఆచరిస్తే పాపాలు అన్నీ తొలగిపోయినట్టే.. బీజేపీలో చేరితే కూడా మీ పాపాలు తొలగిపోతాయి’ అని ఆయన అన్నారు.
Also Read: వచ్చే ఏడాది జనవరి 1న అయోధ్య రామ మందిరం సిద్ధం: అమిత్ షా కీలక ప్రకటన
‘తమ ట్రైన్ బోగీలు ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీ బోగీల్లో వచ్చి కూర్చోండి. ప్రధాని మోడీ మనం చేరాల్సిన గమ్యానికి తీసుకెళ్లుతారు’ అని పేర్కొన్నారు.
ప్రతిపక్షంలోని సీపీఎం పార్టీని విమర్శిస్తూ.. కమ్యూనిస్టులు రాష్ట్రంలో ప్రజల ప్రజాస్వామిక హక్కులను కాలరాసి ఇన్నాళ్లు పాలించారని ఆరోపణలు సంధించారు. ‘కమ్యూనిస్టు పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదు. వాళ్లు కేవలం హింస, ఉగ్రవాద ఎత్తుగడల్లోనే విశ్వసిస్తారు. దక్షిణ త్రిపుర జిల్లాలో సుమారు 69 మంది ప్రతిపకష్ నేతలు లెఫ్ట్ పాలనలో హత్యకు గురయ్యారు. కాక్రాబన్ కూడా ఇందుకు మినహాయింపేమీ కచాదు. ఇక్కడ అనేక రాజకీయ హత్యలు జరిగాయి’ అని తెలిపారు.