UCC: యూసీసీని అమలు చేసే ఉద్దేశం బీజేపీకి లేదు: అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal: యూసీసీని అమలు చేసే ఉద్దేశం బీజేపీకి లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. యూసీసీని అన్ని వర్గాల సమ్మతితో తయారు చేయాలనీ, అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా దీనిని రూపొందించాలని పేర్కొన్నారు.
Uniform Civil Code: యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అంశాన్ని లేవనెత్తిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గుజరాత్ లోని భావ్ నగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ప్రకారం యూనిఫాం సివిల్ కోడ్ ను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. కాబట్టి ప్రభుత్వం యూసీసీని అమలు చేయాలన్నారు. యూసీసీకి సంబంధించిన చట్టాన్ని అన్ని వర్గాల సమ్మతితో రూపొందించాలనీ, అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా దీనిని రూపొందించాలని ఆయన అన్నారు.
యూసీసీ అమలు, గుజరాత్ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన గురించి మీడియా అడిగినప్పుడు, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ అటువంటి కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు.అయితే, ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆ కమిటీ కనిపించకుండా పోయిందని కేజ్రీవాల్ విమర్శించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఇప్పుడు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఎన్నికల తర్వాత ఇంటికి తిరిగి వెళుతుంది అని ఆప్ చీఫ్ పేర్కొన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లలో ఇలాంటి కమిటీలను ఎందుకు ఏర్పాటు చేయలేదని కేజ్రీవాల్ ప్రశ్నించారు. 'యూనిఫాం సివిల్ కోడ్ ను అమలు చేయాలనేది వారి ఉద్దేశం అయితే, జాతీయంగా ఎందుకు అమలు చేయకూడదు? లోక్ సభ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారా? అని ప్రశ్నించారు.
బీజేపీ ఉద్దేశాలు చెడ్డవిగా ఉన్నాయని అభివర్ణించిన కేజ్రీవాల్, తన ఆరోపణల ఆధారంగా అధికార బీజేపీని ప్రశ్నించాలని కోరారు. ఇదిలావుండగా, త్వరలో గుజారత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవాలని రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటి నుంచే ఓటర్లను తమవైపునకు తిప్పుకునే విధంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఆప్ సైతం అధికారం పీఠం దక్కించుకోవాలని చూస్తోంది. ఇదివరకు ఢిల్లీ, పంజాబ్ ఎన్నికల్లో తిరుగులేని విజయంతో పాటు గుజరాత్ స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడంతో అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. రాష్ట్రంలో ఆప్ పునాదిని విస్తృతం చేయడానికి ప్రచారం చేస్తున్నందున ప్రజల హృదయాలను గెలుచుకోవాలనీ, వారిని పార్టీలో చేర్చుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.
అంతకుముందు అక్టోబర్ 29 న, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని కోరుకుంటున్నారు? అని ప్రజలను కోరుతూ క్రౌడ్సోర్సింగ్ ప్రచారాన్ని ప్రారంభించారు. ముస్లింలకు వివాదాస్పద అంశం, మత ఆధారిత చట్టాలను తొలగించే యూనిఫాం సివిల్ కోడ్ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు బీజేపీ శుక్రవారం తెలిపింది. హిందువుల మెజారిటీ ఓట్లను చీల్చేందుకు చేసిన జిమ్మిక్కుగా కాంగ్రెస్ కూడా ఆరోపించింది. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో ఉన్న తరహాలో అటువంటి చట్టాన్ని ఎలా అమలు చేయవచ్చో పరిశీలించడానికి గుజరాత్ ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీని ప్రతిపాదించింది.