కేజ్రీవాల్కు సీఎంగా కొనసాగే హక్కు లేదు.. లిక్కర్ స్కామ్పై కొత్త స్టింగ్ ఆపరేషన్ వీడియోను ప్రదర్శించిన బీజేపీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై బీజేపీ దాడిని మరింత ముమ్మరం చేసింది. ఇందుకు సంబంధించి కొత్త స్టింగ్ ఆపరేషన్ వీడియోను బీజేపీ మీడియా సమావేశంలో ప్రదర్శించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై బీజేపీ దాడిని మరింత ముమ్మరం చేసింది. ఇందుకు సంబంధించి కొత్త స్టింగ్ ఆపరేషన్ వీడియోను బీజేపీ మీడియా సమావేశంలో ప్రదర్శించింది. గతంలో కూడా బీజేపీ ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఎంపిక చేసిన కొందరికి సహాయం చేసేందుకు తన ఎక్సైజ్ పాలసీని రూపొందించిందని బీజేపీ ఆరోపించింది. ఆరోపించిన అవినీతితో సంపాదించిన డబ్బుతో గోవా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో వారి పార్టీ ప్రచారానికి నిధులను సమకూర్చుకుందని విమర్శించారు. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడిన బీజేపీ నాయకులు.. కేజ్రీవాల్కు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదని అన్నారు.
ఈ స్టింగ్ ఆపరేషన్ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి.. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితుడిగా ఉన్నారని బీజేపీ తెలిపింది. ఈ వ్యాపారానికి సంబంధించిన నగదు లావాదేవీలను కొంతమంది మాత్రమే నియంత్రించేలా ఆప్ ప్రభుత్వం ప్రయత్నించిందని బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది అన్నారు. ఈ డబ్బును గోవా, పంజాబ్ ఎన్నికలకు వినియోగించారని త్రివేది ఆరోపించారు.
ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసే వారిపై స్టింగ్ చేయాలని.. దోషులు చర్యలు తీసుకుంటానని అరవింద్ కేజ్రీవాల్ చెప్పేవారని గుర్తుచేశారు. ఇది వెలుగులోకి వచ్చిన రెండో స్టింగ్ ఆపరేషన్ వీడియో అని చెప్పారు. ఈ ఏడెనిమిదేళ్లలో ఆప్ అధికారాన్ని దుర్వినియోగం చేసినదానికంటే గతంలో ఏ పార్టీ కూడా చేయలేదని ఆరోపించారు. ఇందుకు సంబంధించి కేజ్రీవాల్ చర్యలు తీసుకోవాలని.. లేకపోతే గతంలో ఆయన చేసిన ప్రకటనపై క్షమాపణ చెప్పాలని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయం అంటే కమీషన్ అని త్రివేది ఆరోపించారు.
ఎక్సైజ్ పాలసీ వల్ల లబ్ధి పొందిన వారే ఈ వీడియోను రూపొందించారని.. ఇది ఇప్పటికే ప్రజల్లో ఉందని చెప్పారు. ఇది బీజేపీ చేసింది కాదని అన్నారు. ఇక, అవినీతి కోసమే ఆప్ ప్రభుత్వం ఇలా చేసిందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా ఆరోపించారు.