బిట్కాయిన్ కేసు: సినీ నటి శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రాను ప్రశ్నించిన ఈడీ
బిట్కాయిన్ కుంభకోణంపై రాజ్కుంద్రాకు ఉచ్చు
ముంబై: బాలీవుడ్ సినీ నటి శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రాను బిట్ కాయిన్ కేసులో మంగళవారంనాడు ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు.సుమారు రూ. రెండువేల కోట్ల విలువైన బిట్ కాయిన్ కుంభకోణంపై ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన భరధ్వాజ ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ అధికారులు రాజ్కుంద్రాను మంగళవారం నాడు విచారించారు.మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన అమిత్ భరధ్వాజను ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా రాజ్కుంద్రా పేరు వెలుగులోకి వచ్చింది.
భరధ్వాజ సోదరుడు గెయిన్ బిట్ కాయిన్ , జీబీ మైనింగ్ వెంచర్స్ పలు మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీమ్స్ ను ప్రారంభించి కొంత కాలం పాటు నడిపించాయి. ఆ తర్వాత కొంతకాలానికి పెట్టుబడిదారులకు డబ్బులను ఎగవేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు. అమిత్ భరధ్వాజ ఇచ్చిన సమాచారం మేరకే రాజ్కుంద్రాను ఈడీ అధికారులు మంగళవారం నాడు విచారించినట్టు సమాచారం.
గతంలో కూడ ఐపీఎల్ లో స్పాట్ బెట్టింగ్ కు పాల్పడినట్టుగా రాజ్కుంద్రాపై కేసులు నమోదయ్యాయి. క్రికెట్ కు సంబంధించిన వ్యవహరాల్లో పాల్గొనకూడదని రాజ్కుంద్రాపై నిషేధం విధించినట్టు సమాచారం.