వీళ్లు మాములు దొంగలు కాదు బాబోయ్.. ఏకంగా సెల్ టవర్ నే ఎత్తుకెళ్లిపోయారు.. !
Patna: పక్కా ప్రణాళికతో అందరూ చూస్తుండగానే మొబైల్ టవర్ను దొంగలు ఎత్తుకెళ్లారు. పాట్నాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన మొబైల్ టవర్ రూ.19 లక్షల విలువ చేసేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
Bihar: కొన్ని సార్లు కొన్ని సంఘటనలు పూర్తయిన తర్వాత అందరూ ముక్కున వేలేసుకునేలా ఔర అనిపించేలా ఉంటాయి. దొంగతనాలకు సంబంధించి అలాంటి ఘటనలు చాలానే ఇదివరకు వెలుగులోకి వచ్చాయి. తాజాగా బీహార్ లో దొంగలు చేసిన పనిని చూసి.. వీళ్లు మాములు దొంగలు కాదు బాబోయ్.. ! అంటున్నారు. ఎందుకంటే వీళ్లు ఏకంగా మొబైల్ టవర్ ను దొంగిలించారు. ఇది మాములే కదా అనుకోకండి. ఎందుకంటే ఈ ఘరానా దొంగలు ఈ పనిచేసింది ఏ అర్థరాత్రి పూటో.. ఎవరూ లేని సమయంలో కాదు.. అందరూ చూస్తుండగానే, పట్టపగలు దర్జాగా మొబైల్ టవర్ ఎత్తుకెళ్లారు.. !
వివరాల్లోకెళ్తే.. బీహార్ రాజధాని పాట్నాలో ఓ దొంగల ముఠా రూ.19 లక్షల విలువైన మొబైల్ టవర్ను ఎత్తుకెళ్లారు. అందరూ చూస్తుండగానే.. ఒక నివాసి ఇంటి టెర్రస్పై అమర్చిన మొబైల్ టవర్ను మొబైల్ కంపెనీ అధికారులుగా నటిస్తూ ఆ వ్యక్తులు దొంగిలించారు. పాట్నాలోని గార్దానీబాగ్ ప్రాంతంలోని యార్పూర్ రాజ్పుతానా కాలనీలో ఉన్న లాలన్ సింగ్ అనే వ్యక్తి ఇంటి టెర్రస్పై గుజరాత్ టెలి లింక్ ప్రయివేటు లిమిటెడ్ (GTPL) కంపెనీ టవర్ను ఏర్పాటు చేసింది. ఈ ఘటనకు సంబంధించి లాలన్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. మొబైల్ కంపెనీ అధికారులుగా నటిస్తున్న కొందరు వ్యక్తులు తన వద్దకు వచ్చి కంపెనీకి భారీ నష్టాలు వస్తున్నాయనీ, అందుకే తాము మొబైల్ టవర్ను తొలగించాలని ప్లాన్ చేశామని చెప్పారు. లాలన్ సింగ్ వారి గుర్తింపును క్రాస్ చెక్ చేయకుండా అంగీకరించాడు.
అనంతరం 25 మంది మూడు రోజుల పాటు రాత్రింబవళ్లు కష్టపడి గ్యాస్ కట్టర్ మిషన్లతో మొబైల్ టవర్ను ముక్కలు చేశారు. చివరకు ఆ ముక్కలను ట్రక్కులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. దొంగిలించబడిన మొబైల్ టవర్ విలువ రూ. 19 లక్షలు ఉంటుందని సంబంధిత కంపెనీ వర్గాలు తెలిపాయి. దీనిని దాదాపు 15 ఏళ్ల క్రితం లాలన్ సింగ్ ఇంటిపై అమర్చారని సోర్సెస్ చెప్పినట్టు ఇండియా టుడే నివేదించింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఇక్కడి ఆసక్తి కలిగించే మరో విషయం ఏమిటంటే.. మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ GTPL శనివారం వరకు దొంగతనం గురించి తెలియదు. కంపెనీ అధికారులు పనికిరాని అన్ని మొబైల్ టవర్లను తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే గార్దానీబాగ్లోని మొబైల్ టవర్ కనిపించడం లేదు.
కొన్ని నెలల క్రితం బీహార్ లో మరో ప్రాంతంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. సాసారం జిల్లాలో 500 టన్నుల బరువున్న 60 అడుగుల పొడవైన ఇనుప వంతెనను జలవనరుల శాఖ అధికారులుగా చూపుతున్న వ్యక్తులు దొంగిలించారు. ఇది 60 అడుగుల పొడవైన స్టీల్ బ్రిడ్జి కావడం గమనార్హం. 1972లో నస్రీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమియావర్ గ్రామంలోని అర్రా కాలువపై 500 టన్నుల బరువున్న ఈ వంతెనను నిర్మించినట్లు పోలీసులు తెలిపారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులుగా నటిస్తున్న కొంతమంది వ్యక్తులు గ్యాస్ కట్టర్లు, మట్టి మూవర్ల సహాయంతో పనికిరాని వంతెనను మూడు రోజులుగా కూల్చివేశారని పోలీసులు తెలిపారు. అయితే, దీని గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చే లోపే దొంగలు తమ పనిని పూర్తి చేసుకుని అక్కడి నుంచి ఊడాయించారు.