Bihar Politics: ఇది శుభారంభం..ఆర్జేడీ, జేడీయూ దోస్తీని స్వాగతించిన అఖిలేశ్
Bihar Politics: బీహార్ లో శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తనదైన శైలిలో స్పందించారు. బీహార్ లో కొత్తగా ఏర్పాటు కానున్న.. జేడీయూ-ఆర్జేడీ ప్రభుత్వాన్ని స్వాగతించారు.
Bihar Politics: బీహార్లో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆ పదవిని వీడారు. దీంతో పాటు జేడీయూ కూడా ఎన్డీయేకు దూరమైంది. ఇప్పుడు మహాకూటమిలోని పార్టీలతో కలిసి నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సిద్దమయ్యాయి. ఈ పరిణామంపై సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఇది శుభారంభం. నాడు 'క్విట్ ఇంగ్లీష్ ఇండియా' నినాదం ఇవ్వగా, నేడు బీహార్ లో 'భగావో బీజేపీ' నినాదం వస్తోంది. త్వరలో రాజకీయ పార్టీలు, వివిధ రాష్ట్రాల ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా నిలబడతారని భావిస్తున్నాను.
నితీష్ కుమార్పై బిజెపి మండిపడుతుంది. నితీష్ కుమార్ నిర్ణయాన్ని బీజేపీ నమ్మకద్రోహంగా అభివర్ణించింది. బీహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ మాట్లాడుతూ.. 74 సీట్లు గెలుచుకున్న తర్వాత కూడా బీజేపీ ఇచ్చిన హామీ మేరకు ఎన్డీయే కూటమిలో నితీష్ కుమార్ను ముఖ్యమంత్రిని చేసిందని అన్నారు. ఇది బీహార్ ప్రజలకు, బీజేపీకి చేసిన ద్రోహమనీ, ప్రజల తీర్పును ఉల్లంఘించడమేననీ, దీనిని బీహార్ ప్రజలు అసలు సహించరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం గమనార్హం. మంగళవారం ఉదయం జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశం అనంతరం నితీశ్ కుమార్ బీజేపీతో పొత్తు తెంచుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీని తరువాత.. RJD-కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమయ్యాయి.
బీహార్ లో ఏడు పార్టీల పొత్తుతో మహా కూటమి ఏర్పడింది. నితీశ్ కుమార్ మరోసారి సీఎం పీఠం ఎక్కనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే గవర్నర్ ను కలిసి.. తమకు 164 మంది ఎమ్మెల్యేల బలం ఉందని తెలిపినట్టు సమాచారం.
ఇదిలాఉంటే.. బీహార్ శాసనసభలో 243 సీట్లున్నాయి. అందులో బీజేపీకి 74 సీట్లు ఉండగా, జేడీయూకి 43 సీట్లు ఉన్నాయి. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ తరవాత 75 సీట్లున్న ఆర్జేడీతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమైంది. ఇదే తరుణంలో మరో ఐదు ఇతర పార్టీలు కూడా ఈ కూటమిలో చేరనున్నాయి. మరికాసేపటిలో అధికారిక ప్రకటన రానున్నది.